శాఖల కేటాయింపు వ్యవహారం మిత్రపక్షాల మధ్య కొత్త చిచ్చు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శాఖల కేటాయింపు వ్యవహారం మిత్రపక్షాల మధ్య కొత్త చిచ్చు

మహారాష్ట్రలో సీఎం ఉద్ధవ్ థాకరేకి.. ఇప్పుడు కత్తిమీద సాము
ముంబై జనవరి 7 (way2newstv.com)
: మహారాష్ట్రలో మంత్రి పదవులు, శాఖల కేటాయింపు వ్యవహారం మిత్రపక్షాల మధ్య కొత్త చిచ్చు పెడుతోంది. ఓవైపు మంత్రి పదవులు రాక అసమ్మతి రాగం అందుకున్న ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు మల్లగుల్లాలు పడుతున్న సీఎం ఉద్ధవ్ థాకరేకి.. ఇప్పుడు శాఖల కేటాయింపు కత్తిమీద సాములా తయారైంది. తమకు అంతగా ప్రాధాన్యం లేని శాఖలు కేటాయించారంటూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కస్సుమంటున్నారు. కొందరు దీనిపై పార్టీ అధిష్టానంతో మాట్లాడేందుకు ఢిల్లీలో చక్కర్లు కొడుతుండగా.. మరికొందరు తమకు కేటియించిన శాఖల బాధ్యతలు స్వీకరించేందుకు విముఖత చూపిస్తున్నారు. 
శాఖల కేటాయింపు వ్యవహారం మిత్రపక్షాల మధ్య కొత్త చిచ్చు

శాఖల కేటాయింపులో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతల్లో విజయ్ వడెట్టివర్ ప్రముఖంగా కనిపిస్తున్నారు. రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గట్టి మద్దతు ఇచ్చిన ఆయన.... మంత్రివర్గ విస్తరణ తర్వాత జాడలేకుండా పోయారు. వడెట్టివర్‌కు ఓబీసీ మంత్రిత్వ శాఖ, ఉప్పు కయ్యల అభివృద్ధి, భూకంప బాధితుల పునవాస శాఖలను కేటాయించారు. అయితే అ శాఖలతో ఆయన ఏం చేయగలరని పార్టీలోని సన్నిహితులు కొందరు ప్రశ్నిస్తున్నారు. ‘‘ఓబీసీ శాఖ, ఉప్పుకయ్యల అభివృద్ధి శాఖలతో చేసేది ఏమీ ఉండదు. సాయం, పునరావాస మంత్రిత్వ శాఖ కూడా రైతులకు సాయం చేసేలా ఉంటే బాగుండేది. కానీ భూకంప బాధితులకు సాయం, పునరావాసాలకు ఆయనను మంత్రిని చేశారు. అంటే భూకంపం వచ్చేదాకా ఆయన చేయడానికి ఏం ఉండదు..’’ అని కాంగ్రెస్ నాయకుడొకరు పెదవి విరిచారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ మంత్రుల్లో మరొకరు అమిత్ దేశ్‌ముఖ్. ఆయనకు మెడకల్ విద్య, సాంస్కృతిక వ్యవహారాల శాఖను కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడైన అమిత్.. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేని కలిసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.కాగా మరో మిత్రపక్షం ఎన్సీపీలో కూడా శాఖల కేటాయింపుపై అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. తనకు ఆహార, పౌర సరఫరాల, వినియోగదారుల భద్రత శాఖను ఇచ్చి, తనకంటే పార్టీలో జూనియర్ అయిన జితేంద్ర అవద్ లాంటి వాళ్లకు హౌసింగ్ శాఖ ఇవ్వడమేంటూ చగ్గన్ భుజ్‌బల్ పార్టీ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. అయితే ఎన్సీపీలో వివాదం ఇట్టే ముగిసిపోయేట్టు కనిపిస్తున్నా.. కాంగ్రెస్‌లో మాత్రం అంత తేలిగ్గా తెగేట్టు కనిపిచడం లేదు. రెవెన్యూ శాఖ పొందిన బాలాసాహెబ్ తోరాత్‌ తప్ప మిగతా కాంగ్రెస్ మంత్రులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండడమే దీనికి కారణమని చెబుతున్నారు.