ఢమాల్ మంటున్న దొనకొండ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఢమాల్ మంటున్న దొనకొండ

ఒంగోలు, జనవరి 7, (way2newstv.com)
మూడు రాజధానుల ప్రతిపాదన ఏమో కాని దొనకొండ ప్రాంతంలో మళ్లీ భూముల ధరలు ఢమాల్ అన్నాయి. నిన్న మొన్నటి వరకూ దొనకొండలో భూముల ధరలు నింగినంటాయి. వైెఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే దొనకొండకు రాజధానిని మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగంది. గతంలో శివరామకృష్ణన్ కమిటీ కూడా అదే సూచించింది. దీంతో జగన్ దొనకొండను రాజధానిగా చేసుకుంటారన్న ప్రచారం జరిగింది.దొనకొండలో భూముల ధరలు ఎక్కడికో వెళ్లిపోయాయి. దొనకొండ ప్రాంతంలో వైసీపీ నేతలు కూడా భూములు కొనుగోలు చేశారని తెలియడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నలుమూలల నుంచి వచ్చి దొనకొండలో భూములు కొనుగోలు చేశారు. 
ఢమాల్ మంటున్న దొనకొండ

దీంతో ఎకరం రెండు లక్షలు ఉంటే ధర దాదాపు యాభై లక్షల రూపాయలకు చేరింది. వైసీపీ ప్రభుత్వం రాగానే అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు హోటళ్లు కూడా పెద్దయెత్తున వెలిశాయి.రాజధాని అమరావతిలో వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడం, మంత్రి బొత్స సత్యనారాయణ పదే పదే రాజధాని అమరావతి ఉండదంటూ ప్రకటనలు చేయడంతో అందరూ ఇక దొనకొండ రాజధానిగా చేస్తారని భావించారు. రాజధానిగా చేయకపోయినా దొనకొండ పారిశ్రామిక హబ్ గా తీర్చి దిద్దుతారని అనుకున్నారు. తొలి నుంచి జగన్ కూడా దొనకొండ పట్ల సానుకూలంగా ఉండటంతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఊపందుకుంది.ఇప్పుడు జగన్ ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపులు రెండూ తమ నివేదికలో దొనకొండ ప్రస్తావన లేదు. పారిశ్రామిక క్యారిడార్ ఏర్పాటు విషయంలో కూడా దొనకొండ విషయం ఈ రెండు నివేదికల్లో లేకపోవడంతో మళ్లీ అక్కడ భూముల ధరలు దారుణంగా పడిపోయాయి. ప్రకాశం జిల్లాను రెండు కమిటీలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. మొత్తం మీద రెండు కమిటీల నివేదికతో దొనకొండలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఢమాల్ అయింది.