బంగారం ధర పరుగుకు బ్రేకులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బంగారం ధర పరుగుకు బ్రేకులు

ముంబై, జనవరి 8  (way2newstv.com)
బంగారం ధర పరుగుకు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా ర్యాలీ చేస్తూ వచ్చిన పసిడి ధర ఈ రోజు పడిపోయింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు స్తబ్దుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో ధగధగమంటూ మెరిసిపోయిన బంగారం ధర దిగొచ్చింది.హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర భారీగానే పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.530 దిగొచ్చింది. దీంతో పసిడి ధర రూ.38,430కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.530 తగ్గుదలతో రూ.41,980కు పడిపోయింది.అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా బంగారం ధర పెరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఇవి స్తబ్దుగా ఉండిపోయాయి. ఈ నేపథ్యంలోనే మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది.
బంగారం ధర పరుగుకు బ్రేకులు

అలాగే అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి కూడా రికవరీ బాట పట్టడంతో పసిడి నేలచూపు చూసింది.బంగారం ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.250 పడిపోయింది. దీంతో ధర రూ.50,750కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలోనూ ధరలు ఇలానే ఉన్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.550 పడిపోయింది. దీంతో ధర రూ.39,250కు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 తగ్గింది. దీంతో ధర రూ.40,440కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.250 తగ్గింది. దీంతో ధర రూ.50,750కు దిగొచ్చింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 1.41 శాతం పెరుగుదలతో 1,597.60 డాలర్లకు చేరింది. బంగారానికి ఇది ఏడేళ్ల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌‌కు 0.84 శాతం పెరుగుదలతో 18.57 డాలర్లకు ఎగసింది. ఇకపోతే అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా బంగారం ధర 2019 సెప్టెంబర్ నెలలో ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే.మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర గత ఏడాది దాదాపు 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.పసిడి ధర మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడతాయని ఎబాన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అభిషేక్ బన్సాల్ తెలిపారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి పడిపోవడం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలిచిందని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర రూ.50,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు.ఁ