చిత్తూరు జిల్లా టూర్ కు జగన్ ... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చిత్తూరు జిల్లా టూర్ కు జగన్ ...

తిరుపతి, జనవరి 8, (way2newstv.com)
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు నగరానికి వస్తున్న నేపథ్యంలో ఓవైపు అధికారులు పర్యటన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సీఎంకు స్వాగతం పలకడానికి ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. ఇప్పటికే నగరంలోని అన్ని ప్రాంతాలను ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేశారు. తమిళనాడులో ఫ్లెక్సీలు, స్వాగత ఆర్చిలను తయారుచేసే వారిని చిత్తూరుకు పిలిపించి పలుచోట్ల పెద్ద ఎత్తున పనులు చేయిస్తున్నారు. సీఎం పర్యటన కావడంతో అటు కూలీలకు.. నగరంలోని ఫ్లెక్సీ ప్రింటర్లకు పెద్ద ఎత్తున పనులు దొరుకుతున్నాయి. చిత్తూరుతో పాటు తమిళనాడు నుంచి కూడా ఫ్లెక్సీలను ప్రింట్‌ తీసుకువచ్చి పెడుతున్నారు. 
చిత్తూరు జిల్లా టూర్ కు జగన్ ...

ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ప్రస్తుతం అధికారులకు ప్రాథమికసమాచారం అందింది. దీని ప్రకారం తొలుత ముఖ్యమంత్రి ప్రత్యేక విమానం ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా చిత్తూరు నగరంలోని డీఎస్‌ఏ  మైదానంలో దిగుతారు. అక్కడి నుంచి ఓపెన్‌టాప్‌ జీపు నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ కలెక్టర్‌ బంగ్లా, ఓవర్‌ బ్రిడ్జి, గాంధీ విగ్రహం, ఎంఎస్‌ఆర్‌ కూడలి, వేలూరు రోడ్డు, గిరింపేట మీదుగా పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ద్వారా మైదానంలోకి చేరుకుంటారు. అక్కడ అమ్మఒడికి అంకురార్పణ చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.అనంతరం కాన్వాయ్‌ ద్వారా మెసానికల్‌ మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు. ఇందులో ఏవైనా చిన్నపాటి మార్పులు ఉండొచ్చు.. లేకుంటే యథావిధిగా షెడ్యుల్‌ ప్రకారం సీఎం పర్యటన సాగుతుంది. ముఖ్యమంత్రి పర్యటనకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు పహారాకాస్తున్నారు. చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో సివిల్, ఏఆర్, ఎస్టీఎఫ్, బాంబ్‌స్వా్కడ్‌ బృందాలు సీఎం పర్యటన సాగే ప్రాంతాలను జెల్లెడ పడుతున్నాయి. మరోవైపు సీఎంవో కార్యాలయ సెక్యూరిటీ కూడా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.