సంకటంలో ఉద్ధవ్ ధాక్రే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సంకటంలో ఉద్ధవ్ ధాక్రే

ముంబై, జనవరి 29 (way2newstv.com)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సంకట స్థితిలో చిక్కుకున్నారు. ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వంలో సొంత ఆలోచనలను అమలు చేయలేని ఉద్ధవ్ థాక్రే ఏ మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే నేషనలిస్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల అనుమతి తప్పనిసరి. నిన్న మొన్నటి వరకూ బీజేపీ మిత్రపక్షంగా కొనసాగిన ఉద్ధవ్ థాక్రే హిందూ ఓటు బ్యాంకుపైనే ఆధారపడి ఉన్నారు. మరాఠా నినాదం కూడా ఉద్ధవ్ థాక్రే పార్టీకి ఇప్పటి వరకూ విజయాలను తెచ్చిపెట్టింది.అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తమకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడంతో బద్ధశత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఉద్ధవ్ థాక్రే ఏర్పాటు చేశారు. అయితే మూడు పార్టీలు కలసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నాయి. 
సంకటంలో ఉద్ధవ్ ధాక్రే

ఆ ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. చిన్నా చితకా నిర్ణయాలు తప్ప కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉద్ధవ్ థాక్రేకు లేదనే చెప్పాలి.ఈ పరిస్థితుల్లో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం అసెంబ్లీలో చేయాలని ఉద్ధవ్ థాక్రే పై వత్తిడి ప్రారంభమయింది. ఇప్పటికే పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా పంజాబ్, రాజస్థాన్, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి సీఏఏను రాష్ట్రంలో అనుమతించబోమని తీర్మానాలు చేశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సయితం త్వరలోనే అసెంబ్లీని ఏర్పాటు చేస్తామని ఇప్టటికే వెల్లడించారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, పంజాబ్ లలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయడంతో మహారాష్ట్రలోనూ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అయితే ఇందుకు ఉద్ధవ్ థాక్రే సిద్ధంగా లేరు. ఎన్సీపీ సాయాన్ని ఆయన తీసుకున్నారు. మహారాష్ట్రలో ఎవరూ సీఏఏ వల్ల ఇబ్బంది పడరని, తీర్మానం అవసరం లేదని ఎన్సీపీ కూడా ఉద్ధవ్ థాక్రేకు వత్తాసు పలుకుతుంది. మరి కాంగ్రెస్ మాత్రం తీర్మానం చేయాలనే అంటుంది. దీంతో ఉద్ధవ్ థాక్రే సందిగ్దంలో పడ్డారు.