ఒంగోలు,జూలై 28 (way2newstv.com)
కుట్ర రాజకీయాలు చేస్తూ కేసుల మాఫీ కోసం వైకాపా లాలూచీ పడుతోందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం నాడు ఒంగోలులో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు మాట్లాడుత రాజీనామాలు చేయటమంటే పిరికితనంతో పారిపోవటమేనన్నారు. మోడీకి భయపడి రాజీనామాలు చేసి ఇళ్లలో ఉంటున్నారన్నారు. నేను వైకాపా ఉచ్చులో పడలేదు.. భాజపానే అవినీతి కుడితిలో పడిందన్నారు. తెలుగుజాతికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని అయన అన్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు భాజపాను ఓడించారన్నారు. కర్ణాటకలో తెలుగువారు తమ సత్తా చూపించారన్నారు. అధికారం ముఖ్యం కాదని, ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు. బెదిరించి.. భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారన్నారు.
వైకాపావి కుట్ర రాజకీయాలు
బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, నమ్మకద్రోహానికి గుణపాఠం చెబుతామని, వదిలిపెట్టమని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అని, 2019 నాటికి ఈ ప్రాజెక్టు ను పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని అన్నారు. సంక్రాంతి నాటికి వెలిగొండ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒక టన్నెల్ ను పూర్తి చేసి నీరందిస్తామని, ఏడాదిలోగా రెండో టన్నెల్ పూర్తి చేసి తీరుతామని హామీ ఇచ్చారు.విభజనలో హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోయినా పెద్దమనసుతో అంగీకరించామని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ను అభివృద్ది చేసింది తానేనన్నారు. సమానపద్దతిలో విభజన జరగలేదన్నారు. తెలంగాణకు మిగులు బడ్జెట్ ఇచ్చి.. మనకు లోటు బడ్జెట్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ కూడా తన తప్పు తెలుసుకుని అవిశ్వాసానికి మద్దతిచ్చిందని తెలిపారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని యావత్ దేశానికి వివరించగలిగామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు సుధాకర్ కుటుంబాన్ని ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక హోదా కోసం ఢిల్లీలో టవర్ ఎక్కిన వరంగల్ యువకుడిని చంద్రబాబు అభినందించారు. అలాగే, ఏపీకి జరిగిన అన్యాయంపై ఢిల్లీలో టీడీపీ ఎంపీలు రాజీలేని పోరాటం చేశారని ప్రశంసించారు