హైదరాబాద్ ఆగష్టు 11 (way2newstv.com):
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'కంటి వెలుగు' కార్యక్రమంలో అదనపు బాధ్యతలను తప్పనిసరిగా నిర్వర్తించాలని అధికారులు ఒత్తిడి తీసుకురావద్దని '2వ ఏఎన్ఎం అసోసియేషన్ తెలంగాణ' రాష్ట్ర సమన్వయకర్త జి.మాధవీలత ప్రభుత్వాన్ని కోరారు. 2వ ఏఎన్ఎం అసోసియేషన్ తరపున రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బాలాజీ వి.పవార్ కు ఆమె వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ.. 'కంటి వెలుగు' ప్రాజెక్ట్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈవో)లుగా అదనపు బాధ్యతలు తీసుకోవావాలని 2వ ఏఎన్ఎంలు మరియు ఇతర సిబ్బందిపై అధికారులు ఒత్తిడి తీసుక రావద్దన్నారు.
'కంటి వెలుగు'లో అదనపు బాధ్యతలపై ఒత్తిడి తేవొద్దు!
ప్రభుత్వానికి '2వ ఏఎన్ఎం అసోసియేషన్ వినతి
అదనపు బాధ్యతలను నిర్వర్తించే వారికిచ్చే వేతనంపై కూడా స్పష్టత ఇవ్వాలన్నారు. డైరెక్ట్ గా డీఈవోలుగా రిక్రూట్ చేసుకునేవారికి రూ.15 వేలు ఇవ్వనుండగా, అదనపు బాధ్యతలను నిర్వర్తించే వారికి తక్కువ వేతనం ఇస్తామనడం సరికాదని, సముచితరీతిలో వేతనాన్ని పెంచి ఇవ్వాలని ఆమె కోరారు.సమాన పనికి సమాన వేతనం ద్రుష్టితో డీఈవోలుగా అదనపు బాధ్యతలు నిర్వర్తించేవారికి మంచి వేతనం ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. వైద్య, ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న 2వ ఏఎన్ఎంలను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆరోగ్య కార్డులతో పాటుగా ఇతర అలవెన్సులను ఇవ్వాలని 2వ ఏఎన్ఎం అసోసియేషన్ - తెలంగాణ' తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నామని మాధవీలత తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకురాళ్లు జమీల, కమల, అరుణ తదితరులు పాల్గొన్నారు.