విజయనగరంలో మరో 338 గ్రామపంచాయతీలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విజయనగరంలో మరో 338 గ్రామపంచాయతీలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్

విజయనగరం, ఆగస్టు 29, (way2newstv.com)
రెండు వేలు జనాభా దాటిన గ్రామ పంచాయతీల్లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ రానుంది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదిక తయారీ సర్వే ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 144 పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పం తప్పించి ఎంపిక చేసిన వాటిలో మరెక్కడా పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఈ పనుల సంఖ్యను 30కి కుదించారు. ఇందులో అర్బన్‌ అమలవుతున్న మండలాల్లో ఒక పంచాయతీ, ఐటీడీఏ పరిధిలో ఒక పంచాయతీ, మైదాన ప్రాంతాల్లో ఒక పంచాయతీకి వంతున పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. 
విజయనగరంలో మరో 338 గ్రామపంచాయతీలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్

ఇటీవల అమరావతి కేంద్రంగా జరిగిన  20 వేలు జనాభా దాటిన పంచాయతీల్లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, 5 వేలు జనాభా దాటిన పంచాయతీల్లో బహిరంగ కాలువల నిర్మాణం, 2 వేలు జనాభా లోపున్న పంచాయతీల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని సాధ్యాసాధ్యాలపై అధికారులు ఆలోచన చేసినప్పటికీ కార్యరూపంపై సందేహాలు నెలకొనడంతో ఈ ఆలోచననూ పక్కన పెట్టేశారు. ఇటీవల గజపతినగరం, మానాపురం, పెదపెంకి పంచాయతీల్లో సర్వే పూర్తయి తుది నివేదిక సిద్ధమైంది. తాజాగా చీపురుపల్లి, గరివిడి మండలాల్లో సర్వే జరుగుతోంది. వచ్చే రెండు నెలల్లో ప్రభుత్వ అనుమతి పొందగానే భూగర్భ మురుగునీటి పారుదల నిర్మాణ పనులను చేపట్టేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో 2 వేలు జనాభా దాటిన 338 గ్రామపంచాయతీలకు లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి. డిసెంబరు నాటికి జిల్లావ్యాప్తంగా 250 కిలోమీటర్ల మేర భూగర్భ కాలువల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. అంటే సగటున 9 నియోజకవర్గాల్లోనూ 30 కిలోమీటర్ల మేర ఏర్పాటు కానుంది.  పదిహేను రోజుల క్రితం జిల్లాలో గజపతినగరం, మానాపురం, బలిజిపేట మండలం పెదపెంకిలో భూగర్భమురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన ప్రత్యేక సర్వే జరిగింది. పెదపెంకిలో 8 కిలోమీటర్లకు రూ. 4 కోట్లు, గజపతినగరంలో 11 కిలోమీటర్ల్లకు రూ.3.5 కోట్లు, మానాపురంలో 4 కిలోమీటర్ల మేర భూగర్భ కాలువలు వేసేందుకు నివేదికను తయారైంది. తాజాగా చీపురుపల్లి, గరివిడి పట్టణాల్లో భూగర్భకాలువ వ్యవస్థకు సంబంధించిన సర్వే ప్రారంభమైంది.జిల్లాలో భూగర్భ కాలువ వ్యవస్థకు సంబంధించి సర్వేను విశాఖపట్నానికి చెందిన జియోకాన్‌ ప్రైవేటు సంస్థ చేపడుతోంది. నేరుగా డీజీపీఎస్‌, రోవర్‌ సాయంతో సర్వేను నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియలో శాటిలైట్‌ వ్యవస్థను వినియోగిస్తోంది. ఎక్కడెక్కడ ఎత్తుగా ఉంది, ఎక్కడ పల్లంగా ఉంది, అన్ని ప్రాంతాలకు అనుసంధానం చేసిన భూగర్భనీటి కాలువను చివరిగా ఎటువైపు తీసుకెళ్లాలో తదితర అంశాలను దీనిద్వారా తెలుస్తుంది. ఈమేరకు ఎంత మొత్తం వ్యయం అవసరమో పూర్తి నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వానుమతులు రాగానే భూగర్భ మురుగు కాలువల పనుల ప్రక్రియ ప్రారంభిస్తారు.