డాక్టర్, నర్సుల మధ్య క్రైమ్ కధా చిత్రం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డాక్టర్, నర్సుల మధ్య క్రైమ్ కధా చిత్రం

తిరుపతి, ఫిబ్రవరి 8 (way2newstv.com)
విడాకుల కేసులో వాయిదాకు హాజరయ్యేందుకు తిరుపతి కోర్టుకు వచ్చిన డాక్టర్‌పై గతంలో ఆయన వద్ద పనిచేసిన నర్స్ యాసిడ్ దాడికి పాల్పడటం కలకలం రేపింది. డాక్టర్‌పై యాసిడ్ పోసి ఆ వెంటనే తాను కూడా టాయిలెట్‌లోకి వెళ్లి మిగిలిన యాసిడ్‌ను తాగేసింది. ఆమెను హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. యాసిడ్ గాఢత తక్కువగా ఉండటంతో డాక్టర్‌కు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, ఈ దాడి కారణంగా కొన్ని విషయాలు బయటికి వచ్చాయి. దాడి చేసిన నర్స్ ఆ డాక్టర్‌తో గతంలో వివాహేతర సంబంధం నడిపింది. తనను పెళ్లిచేసుకోవాలని డాక్టర్‌ను వేధించింది. మరోవైపు డాక్టర్ నుంచి ఆయన భార్య విడాకులు కోరింది. ఆ విడాకుల కేసులోనే వాయిదా నిమిత్తం డాక్టర్ బెంగళూరు నుంచి తిరుపతి వచ్చాడు. డాక్టర్‌తో తనకున్న సంబంధం గురించి హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న నర్స్ అరుణ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 


డాక్టర్, నర్సుల మధ్య క్రైమ్ కధా చిత్రం

తిరుపతిలోని రమాదేవి హాస్పిటల్‌లో 2015లో ఆదర్శ్‌రెడ్డి డాక్టర్‌గా, అరుణకుమారి నర్సుగా పనిచేసేవారు. అప్పట్లో ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. వారిరువురికి అప్పటికే వివాహమైంది. అరుణ భర్త తాగుడికి బానిస. అతని అడ్డు తొలగించుకోవాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. అరుణను తప్పకుండా పెళ్లిచేసుకుంటానని ఆదర్శ్‌రెడ్డి మాటవ్విడంతో ఆయన చెప్పినట్టే చేసింది. ఆయనిచ్చిన ఇంజెక్షన్‌ను భర్తకు చేసింది. దీంతో అతను మరణించాడు. ఆ తరవాత ఆదర్శ్ నేరుగా అరుణ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఆదర్శ్ రెడ్డికి మరికొంత మంది మహిళలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆయనగారి రాసలీలల గురించి తెలుసుకున్న భార్య విడాకులు కోరింది. ఆ తరవాత తిరుపతిలో ఉద్యోగం మానేసి ఆదర్శ్ బెంగళూరు వెళ్లిపోయాడు. అతని కోసం ఇన్నాళ్లు వేచి చూసిన అరుణ.. కోర్టుకు వస్తున్నాడని తెలుసుకుని యాసిడ్‌తో అక్కడికి వెళ్లి దాడి చేసింది. ఇదిలా ఉంటే, ఈ కేసులో డాక్టర్ ఆదర్శ్ వాదన ఇంకోలా ఉంది. తనను పెళ్లి చేసుకోవాలని అరుణ వెంటపడేదని, అందుకు అంగీకరించకపోవడంతో వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురిచేస్తూ వస్తోందని ఆదర్శ్ చెబుతున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో తనపై ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయించిందని చెప్పారు. అప్పటి నుంచి తనను వేధించినట్లు ఆదర్శ్ చెప్పాడని సీఐ శ్రీనివాసులు వివరించారు. ప్రస్తుతం యువతిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అరుణ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆదర్శ్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఇంతకీ, ఈ కేసులో అరుణ చెప్పింది నిజమా? ఆదర్శ్ చెప్పింది నిజమా? అనేది పోలీసుల విచారణలోనే తేలాలి.