అరకు సిట్టింగ్ హామీతో జంప్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అరకు సిట్టింగ్ హామీతో జంప్

విజయనగరం, ఫిబ్రవరి 14, (way2newstv.com)
ఉత్తరాంధ్ర లో మంచి పట్టున్న నేత కిషోర్ చంద్ర దేవ్. గతంలో అరకు పార్లమెంట్ నుంచి గెలిచి యుపిఏ సర్కార్ లో కేంద్రమంత్రి హోదాలో చక్రం తిప్పారు ఆయన. ఇందిర రాజీవ్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరున్న కిషోర్ చంద్ర దేవ్ ఇప్పుడు టిడిపి తీర్ధం పుచ్చుకోవడం లాంఛనమే. తన రాజకీయ భవిష్యత్తుకు ఆయన దశాబ్దాలపాటు కాంగ్రెస్ తో వున్న అనుబంధాన్ని వదులుకోలేక వదిలేస్తున్నారు ఆయన. 


 అరకు సిట్టింగ్ హామీతో జంప్

అరకు టికెట్ పై హామీ లభించాకే టిడిపి లోకి జంప్ అయ్యేందుకు కిషోర్ సిద్ధం అయ్యారని కొంత కాలంగా నడుస్తున్న ప్రచారాన్ని ఎట్టకేలకు నిజం చేస్తూ సస్పెన్స్ కి తెరదించేశారు మాజీ కేంద్ర మంత్రి.ఏపీలో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు లేవని ఆ పార్టీకి తెలియంది కాదు. అందుకే తమకు విధేయులుగా వున్న వారి రాజకీయ భవిష్యత్తు గాల్లో దీపం చేయరాదని కాంగ్రెస్ అధిష్టానం భావించడంతో చంద్రబాబును కలవాలని ఆదేశాలు ఆశీస్సులు అందాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ కేంద్రమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి సైతం ఇటీవల టిడిపి అధినేతతో భేటీ కావడం తెలిసిందే. తాజాగా కిషోర్ సైతం కోట్ల బాటలోనే బయల్దేరడం గమనార్హం.తనపై వస్తున్న విమర్శలు ఆరోపణలు సత్య దూరం అని కొట్టి పారేస్తున్నారు కిషోర్. కాంగ్రెస్ అధిష్టానం టిడిపి తో చెట్టాపట్టాల్ వేసుకు తిరుగుతున్న నేపథ్యంలో వారి ఆశీస్సులతో పసుపు కండువా కప్పుకోవడానికి సిద్ధం అయ్యాయని కొందరు సాగిస్తున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎపికి టిడిపి తప్ప ప్రత్యామ్నాయం కనపడకే ఆ పార్టీలోకే వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు ఆయన. తనకు సీటు కేటాయించేది లేనిది చంద్రబాబు నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని కిషోర్ పేర్కొనడం విశేషం. మొత్తానికి మాజీ కేంద్రమంత్రి రాకతో విశాఖ మన్యంలో టిడిపికి విజయావకాశాలు మరింత మెరుగు పడుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు