వైజాగ్ జూకు మంచి రోజులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైజాగ్ జూకు మంచి రోజులు

విశాఖపట్టణం, ఫిబ్రవరి 6, (న్యూస్ పల్స్)
ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాల (జూ)కు మంచి రోజులు వచ్చాయి. జూ ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2.39 కోట్లు మంజూరయ్యాయి. డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచ బ్యాంకు ఆమోదం పొందిన నేపథ్యంలో ముందుగా కొన్ని పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. నిధులు మంజూరు చేసింది. 2014 అక్టోబర్‌లో సంభవించిన హుదూద్ తుపానుకు జూ పార్కు కకావికలమైంది. వేలాది చెట్లు నేలకూలగా, రక్షణ గోడలు సైతం ద్వంసమయ్యాయి. జంతువుల రక్షణ, వాటిని ఉంచే మోటులు కూడా పూర్తిగా ద్వంసమయ్యాయి.

 
వైజాగ్ జూకు మంచి రోజులు

 దీంతో జూ పార్కుకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. జరిగిన నష్టాన్ని అంచనావేసి ప్రపంచ బ్యాంకు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనకు ప్రపంచ బ్యాంకు ఆమోదముద్ర వేసింది. మొత్తం రూ.36 కోట్ల మేర పనులకు ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేయనుంది. పనులకు సంబంధించి సమగ్ర పథక నివేదిక సిద్ధం కాకపోవడంతో తాత్కాలికంగా అత్యవసర పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.2,39,26,000 నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని జూ క్యూరేటర్ యశోదబాయి తెలిపారు. ఏనుగులను ఉంచే మోటు రక్షణ గోడ నిర్మాణానికి రూ.75 లక్షలు, జూలో వౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా తారు రోడ్ల నిర్మాణానికి రూ.25 లక్షలు, రాత్రి సమయాల్లో జంతువులను ఉంచేందుకు వీలుగా గదుల నిర్మాణానికి రూ.1.08 కోట్లు, ఎక్స్‌రే మిషన్, జంతువులుంచేందుకు మెష్‌ల కొనుగోలు తదితర పనులకు రూ.30.46 లక్షలు కేటాయించారు. తక్షణమే ఈ పనులు చేపట్టనున్నట్టు క్యూరేటర్ వెల్లడించారు.