జగన్ ను కలిసిన టీడీపి ఎంపీ
హైదరాబాద్, ఫిబ్రవరి 18, (way2newstv.com)
అమలాపురం టీడీపీ ఎంపీ పి. రవీంద్రబాబు సోమవారం ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరిన అవంతి శ్రీనివాసరావుతో పాటు వైఎస్ జగన్తో ఆయన భేటీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై రవీంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు.
టీడీపీకి మరో షాక్
అమలాపురం ఎంపీ టిక్కెట్పై మరోసారి భరోసా ఇవ్వకపోవడంపై ఆయన గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేసి, తిరిగి గెలిచే సత్తా ఉన్న తనను కాదని మరొకరిని ఎంచుకోవడంతోనే, తనకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీలో కొనసాగరాదని నిర్ణయించుకున్నానని రవీంద్రబాబు స్పష్టం చేశారు. కాగా, అనకాపల్లి ఎంపీ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి అవంతి శ్రీనివాసరావు ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. గిద్దలూరు టీడీపీ ఎంపిపి లు, జడ్పీటీసీ, ఎంపిటిసి లు, సర్పంచ్ లు సోమవారం వైకాపాలో చేరారు. గిద్దలూరు ఎంపీపీ వంశిధర్ రెడ్డి, అర్ధవీడు ఎంపీపీ రవికుమార్, అర్ధవీడు జడ్పీటీసీ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ రామకృష్ణా రెడ్డి, సింగల్ విండో సొసైటీ అధ్యక్షలు కృష్ణా రెడ్డి, ఎదురు శ్రీనివాస్ రెడ్డి, ఉడుముల సుధాకర్ రెడ్డి, రంగారెడ్డి లు వైకాపా చేరారు. వీరందరిని జగన్మోహన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.