చిత్తూరు, ఫిబ్రవరి 15(way2newstv.com)
పరిశ్రమల స్థాపనతోనే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి సాధ్యమని మంత్రి అమరనాథ్ రెడ్డి అన్నారు.
కష్టకాలంలో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు పెట్టుబడులను ఆకర్షించేందుకు పలు నూతన పాలసీలను ప్రవేశపెట్టారని అయన అన్నారు. శుక్రవారం పలమనేరులో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన "పరిశ్రమలతో యువతకు ఉపాధి - నైపుణ్యాభివృద్ధి తో ఉద్యోగ అవకాశాలు"పై సదస్సు ను మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు 21 రోజుల్లోనే అన్ని అనుమతి ఇస్తున్నాం.
యువతలో నైపుణ్యం పెంపోందించేదుకు కృషి
ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కారణంగా సులభతర వాణిజ్యంలో దేశంలో వరుసగా రెండోసారి ప్రథమ స్థానంలో నిలిచాం. గడిచిన మూడు పార్టనర్షిప్ సమ్మిట్ లలో దాదాపు రూ. 17 లక్షల కోట్ల ఎంఓయులు చేసుకున్నాం. చేసుకున్న ఎంఒయులను గ్రౌండ్ చేయడంలోనూ దేశంలో ఎపినే అగ్రస్థానంలో ఉందని అన్నారు. భారతదేశం మొత్తం పోటీపడినప్పటికి ఏపి ప్రభుత్వంపై నమ్మకంతో కియా అనంతపురంలో తమ ప్లాంట్ ను ఏర్పాటు చేసి, ఏడాదిన్నరలోనే ట్రయల్ కారును రోడ్డుపైకి తీసుకువచ్చింది. తిరుపతి ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రంగా మారుతోంది. కార్బన్, డిక్సన్, జియో, సెల్ కాన్, టిసిఎల్, ఒల్టాస్ లాంటి కంపెనీలు వచ్చాయని అన్నారు. మరోపక్క అపోలో, హీరో లాంటి ఆటోమొబైల్ కంపెనీలు, సెరామిక్స్, టెక్స్ టైల్స్ పరిశ్రమలు చిత్తూరు జిల్లాకు తరలి వస్తున్నాయి.
పలమనేరు నియోజకవర్గం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. ఆటోనగర్, ఎంఎస్ఎంఇ పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. చెన్నై, బెంగుళూరు నగరాల్లో భూ లభ్యత కొరత వల్ల ఆ నగరాలకు సమీపంగా ఉన్న ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు మొగ్గుచూపుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికోసం యువతలో నైపుణ్యాలను పెంచేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయా ప్రాంతాలలో ఏర్పాటు అవుతున్న పరిశ్రమలకు అనుగుణంగా యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు రూ. 100 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలలో నైపుణ్యం అభివృద్ధి కోర్సులను నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇన్ని కార్యక్రమాలను అమలు చేస్తుంటే ఏపికి రావాల్సిన పారిశ్రామిక రాయితీలు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోంది రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం కేంద్రంతో జతకట్టి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నా ముఖ్యమంత్రి ఎపిని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని అన్నారు.