బాబుపై కొండలా పెరిగిన వ్యతిరేకత - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బాబుపై కొండలా పెరిగిన వ్యతిరేకత


గుంటూరు, మే 24, (way2newstv.com)
ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్‌కు అందని రీతిలో కనీవిని ఎరగని రీతిలో విజయాన్ని అందుకుంది. గత ఎన్నికల్లో ‘అనుభవం’ ట్యాగ్‌తో గెలిచిన చంద్రబాబు.. మరోసారి టీడీపీని గెలిపించలేకపోయారు. 2014లో కొద్దిలో ఓటమి పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈసారి బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 69 ఏళ్ల వయసులో శక్తికి మించి పోరాడినా.. పార్టీకి ఊహకందని రీతిలో పరాభవం ఎదురైంది.చంద్రబాబు నాయుడి అనుభవం రాష్ట్రానికి ఉపయోపగపడుతుందని 2014లో టీడీపీని గెలిపించారు. కొత్త రాష్ట్రం, ఆర్థిక లోటు, అప్పుల భారం మధ్య సీఎంగా బాధ్యతలు చేపట్టిన బాబుపై జనం బోలెడు ఆశలు పెట్టుకున్నారు. రుణమాఫీ హామీ ఇచ్చిన బాబు.. 2019 ఎన్నికల ముంగిటగానీ.. పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయారు. రాష్ట్ర పురోగతి కోసం బాబు తీవ్రంగానే క్షమించినప్పటికీ.. క్షేత్ర స్థాయిలో నాయకుల వైఖరి కారణంగా ప్రజలు విసిగిపోయారు. అవినీతి పెరిగిపోవడం, ఆశించిన రీతిలో అభివృద్ధి జరగకపోవడంతో మార్పు కోరుకున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు.. 


బాబుపై కొండలా పెరిగిన వ్యతిరేకత
ఐదేళ్లలో అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలకే పరిమితం అయ్యారు. ప్రపంచ స్థాయి రాజధాని కేవలం డిజైన్లకే పరిమితమైంది. రైతుల నుంచి వేలాది ఎకరాల భూమిని సమీకరించినప్పటికీ.. రాజధాని నిర్మాణం ఆశలకు మైళ్ల దూరంలోనే నిలిచిపోయింది.కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బాబు.. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమనుకున్నారు. కానీ తీరా చూస్తే.. ప్రత్యేక హోదా పార్లమెంట్‌లో నినాదమైందే తప్పితే.. హోదా మాత్రం దక్కలేదు. ఇక సీఎం చంద్రబాబు స్పెషల్ స్టేటస్‌పై పదే పదే మాట మార్చారు. హోదా కావాలని ఓసారి, ప్రత్యేక ప్యాకేజీ చాలని మరోసారి, లేదు లేదు.. హోదానే కావాలని బాబు యూటర్న్ తీసుకున్నారు. ప్రత్యేక హోదా సాధించలేకపోవడం టీడీపీకి ప్రతికూలంగా మారింది. చంద్రబాబు నాయుడు తన తనయుడికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. లోకేశ్‌ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. పార్టీలోని కొందరు సీనియర్లకు సైతం ఈ విషయం రుచించలేదు. కానీ పార్టీ మీద ప్రేమతో మిన్నకుండిపోయారు. లోకేశ్‌ను దొడ్డి దారిన మంత్రి చేయడం, పాలనలో అతడి జోక్యం పెరగడం ప్రజలకు రుచించలేదు. లోకేశ్ తన ప్రసంగాల్లో పదే పదే తడబడుతూ పలుచనయ్యారు. అధికారంలో ఉన్న మీకు, ప్రతిపక్షంలో ఉన్న మాకు తేడా 20 సీట్లే.. జాగ్రత్త అని అర్థం వచ్చేలా బాబును జగన్ ఓ దశలో హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన బాబు.. వైఎస్ఆర్సీపీ నుంచి వలసలను ప్రోత్సహించారు. 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి దూకేశారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టకుండా.. వలసలపై ఫోకస్ పెట్టడం జనాల్లో ప్రతికూలతకు దారితీసింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టడంతో.. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ తప్పదని కేసీఆర్ హెచ్చరించారు. జగన్‌ను తమ సపోర్ట్ ప్రకటించారు. ‘హోదా’ విషయంలోనూ బాబు తొందరపాటుతో బీజేపీకి దూరమయ్యారు. బీజేపీకి టీడీపీ దూరం కావడం.. జగన్‌తో కమలం పార్టీకి దోస్తీ ఉందనే ప్రచారం కూడా బాబుపై ప్రతికూలత చూపింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే.. కేంద్ర స్థాయిలో జగన్ పోరడతారని జనం విశ్వసించారు. ఏ పార్టీ పట్లనైతే వ్యతిరేక భావంతో టీడీపీ ఆవిర్భవించిందో.. ఆ పార్టీతోనే చంద్రబాబు దోస్తీ కట్టడం జనాలకు రుచించలేదు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేసి దెబ్బతిన్నాయి. ఏపీలో కలిసి పోటీ చేయనప్పటికీ.. కేంద్ర స్థాయిలో కాంగ్రెస్‌తో దోస్తీ చేయడం కూడా బాబుపై వ్యతిరేక ప్రభావం చూపింది. టీడీపీ చరిత్రలోనే తొలిసారిగా 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ఎప్పుడూ పొత్తు కోసం ప్రయత్నించే బాబు.. ఈసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా బరిలో దిగారు. ఫలితం పార్టీకి వ్యతిరేకంగా వచ్చింది. టీడీపీ గట్టిపట్టున్న కోస్తాంధ్రలో.. జనసేన గణనీయమైన స్థాయిలో ఓట్లను చీల్చింది. 2014లో పవన్ మద్దతుతో ఆ ఓట్లన్నీ టీడీపీకి పడ్డాయి. ఈసారి జనసేన కూడా ఎన్నికల బరిలో దిగడంతో.. ఓట్లు చీలి వైఎస్ఆర్సీపీకి కలిసొచ్చింది. జాబు కావాలంటే బాబు రావాలనే నినాదంతో 2014లో చంద్రబాబు సీఎం అయ్యారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన బాబు.. అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకోలేకపోయారు. చివర్లో నిరుద్యోగ భృతి ఇచ్చినప్పటికీ.. అప్పటికే పరిస్థితి చేజారిపోయింది.