ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా:జగన్
అమరావతి మే 23 (way2newstv.com)
ప్రత్యేక హోదానే మా ఏజెండా అని, దాని కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకుంటామని ఏపీ వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. అఖండ విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం ఊహించినదేనని, ప్రజలు, దేవుడు వైసీపీని ఆశీర్వదించారన్నారు. ఎఐసీసీ అధినేత రాహుల్ గాంధీ గురించి ఇప్పుడేమీ మాట్లాడను అని, తరువాత మాట్లాడతానని అన్నారు. ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టింస్తోంది.
ప్రత్యేక హోదానే మా ఏజెండా
వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఫలితాల్లో ఫ్యాన్ హవా కొనసాగుతోంది. కాగా, ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ ఫేస్బుక్ పేజీలో స్పందించారు.'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన అశేష ప్రజానికానికి.. పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటి చెప్పిన యావత్ రాష్ట్ర ప్రజలకు ... హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను' అని ఫేస్బుక్పేజీలో పోస్ట్ చేశారు.