ఇవాళ ఏడు కేంద్రాల్లో రీ పోలింగ్


తిరుపతి, మే 18,  (way2newstv.com):
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పొలిటికల్ హీట్ అంతకంతకూ పెరుగుతోంది. మరో రెండు స్థానాల్లో రీపోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. టీడీపీ ఫిర్యాదు మేరకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు, కాలేపల్లిలోని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఈసీ ఆమోదం లభించింది. ఈ రెండు కేంద్రాలతో పాటు ఆదివారం  మొత్తం 7 కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న తెలిపారు. 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రగిరిలో ఇప్పటికే 5 పోలింగ్ బూత్‌లతో రీపోలింగ్ నిర్వహణకు ఈసీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 



ఇవాళ ఏడు కేంద్రాల్లో రీ పోలింగ్


తాజాగా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు, కాలేపల్లిలోని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. చంద్రగిరి రీపోలింగ్ నిర్వహణ అంశం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. చంద్రగిరిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. రీపోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు చంద్రగిరి రీపోలింగ్ అంశంపై ఢిల్లీలోని ఈసీ కార్యాలయం చుట్టూ వివాదం ముసురుకున్న సంగతి తెలిసిందే. పోలింగ్ జరిగిన నెల రోజుల తర్వాత రీపోలింగ్ ఎలా నిర్వహిస్తారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు  ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఆరోపణలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఖండించారు

Previous Post Next Post