హైద్రాబాద్, ఆగస్టు 20 (way2newstv.com):
హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 2న ప్రారంభమై సెప్టెంబర్ న జరిగే నిమజ్జనంతో ముగుస్తాయి. ఈ ఉత్సవాల కోసం మండపాలు ఏర్పాటుకు చందాలు వసూలు చేయడం పరిపాటి. దీనిని అదనుగా తీసుకుని అసాంఘిక శక్తులు చందాల వసూలు పేరుతో దౌర్జన్యాలకు తెగబడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీలో ఎవరైనా చందాల పేరుతో దౌర్జన్యాలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. గణేష్ మండపం ఏర్పాటుకు పోలీస్ అనుమతి తప్పనిసరని వెల్లడించారాయన. ఆగస్టు 22, నుంచి 26, వరకు ప్రతి పోలీసుస్టేషన్లోనూ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను 29లోగా తిరిగి పోలీస్ స్టేషన్లలో సమర్పించాలని సూచించారు.
దందాలు చేస్తే చర్యలే
మండపాల ఏర్పాటుకు అవసరమైన ఎన్ఓసీ సహా ఇతర పత్రాలు సైతం దరఖాస్తుతో జత చేసి సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఏర్పాటులో పాటించాల్సిన ప్రమాణాలపై పోలీసులు మార్గదర్శకాలు జారీ చేస్తారు. అందుకు అనుకూలంగా ఉంటేనే అనుమతి ఇస్తారు. మండపాల దగ్గర కేవలం బాక్సుటైప్ లౌడ్ స్పీకర్లు పెట్టాలని, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలని వివరించారు కమిషనర్.సిటీ పోలీసులకు అత్యంత కీలక ఘట్టంగా భావించే గణేష్ ఉత్సవాలు సమీపిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గణేష్ ఉత్సవ కమిటీతో పాటు మండప నిర్వాహకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. బందోబస్తు చర్యల్లో నిర్లక్ష్యానికి తావివ్వద్దని సూచించారాయన. సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న దక్షిణ, పశ్చిమ, తూర్పు మండలంపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు కమిషనర్ వెల్లడించారు. సిటీ వ్యాప్తంగా తనిఖీలు, సోదాలు నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా టపాసులు కాల్చడంపై ఆంక్షలు విధించారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడాన్ని నిషేధించారు.మరోపక్క పోలీసుస్టేషన్లు, డివిజన్ల వారీగా ఉన్న సిబ్బంది, అవసరమైన అదనపు ఫోర్సులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీపీ అధికారులకు సూచించారు. ఉత్సవాలు ప్రారంభమయ్యేలోగా మరిన్ని విడతల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. టాస్క్ఫోర్స్, స్పెషల్బ్రాంచ్, డిటెక్టివ్ విభాగం, సిటీ సెక్యూరిటీ వింగ్ తదితర విభాగాలకు చెందిన పోలీసులు నిర్వర్తించాల్సిన విధులను ఎప్పటికప్పుడు నిర్దేశిస్తున్నారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేసిన తరవాత ఉత్సవాలు జరిగే 12 రోజులూ ఆయా ప్రాంతాల్ని బాంబు స్క్వాడ్ నిపుణులు, డాగ్ స్క్వాడ్లు ప్రతి రోజూ రెండు సార్లు తనిఖీ చేయనున్నాయి. గణేష్ ఉత్సవాలకు చందాల పేరుతో దందాలకు దిగే వారిపై కన్నేసి ఉంచాలని, ఈ విషయంలో అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు సీపీ అంజనీకుమార్.
Tags:
telangananews