సమాజాభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర
రాజమహేంద్రవరం ఆగష్టు 2 (way2newstv.com)
సమాజాభివృద్ధిలో మహిళలదే కీలక పాత్రని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ హితవుపలికారు. స్థానిక బైపాస్ రోడ్డులోని కమ్యూనిటీ హాలులో ఓఎన్జీసీ సీఎస్ఆర్ ఆర్ధిక సహాయంతో జరిగిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారని అన్నారు. మహిళలు తమ ఉద్యోగ నిర్వహణను కొనసాగిస్తూనే కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సమాజానికి పేరు ప్రతిష్టలు తీసుకుని వస్తున్నారని ప్రశంసించారు. తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా సమాజంలో ఎవరు ఎలా మెలగాన్న దానిపై పుట్టినప్పటి నుంచి బాధ్యతలు నేర్పుతున్న ఘనత మహిళలకే దక్కుతుందన్నారు.
సమాజాభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర
మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ భార్యలను ఒకప్పుడు వంటింటి కుందేలుగా చూసే వారని, కానీ ఇప్పుడు అంతా మారిందన్నారు. వంటింటి నుంచి ప్రపంచ రాజకీయాల వరకూ ప్రతి విషయాన్ని మహిళలు చక్కదిద్దుతున్నారని కొనియాడారు. ప్రస్తుత ప్రపంచంలో మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) మాట్లాడుతూ మనకున్న నైపుణ్యమే మన అభివృద్ధికి పునాది అని అన్నారు. ప్రతిభకు మరింత సానపెడితే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయన్నారు. మహిళల కోసం, వారి ఆర్ధికాభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ కూడా కుట్టు శిక్షణా కేంద్రాలు నిర్వహించి ఉచితం వందలాది మిషన్లు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. శ్రీ రాజరాజేశ్వరి మహిళా శక్తి సంఘం వ్యవస్థాపకురాలు మాలే విజయలక్ష్ని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కుట్టు మిషనులో శిక్షణ తీసుకున్న 60 మంది మహిళలకు ఉచితంగా మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ ఎస్టేట్ మేనేజర్ ఆర్పి పాటిల్, ఓఎన్జీసీ డీజిఎం రాజేష్, ఆలిండియా ఓఎన్జీసీ యూనియన్ ఛైర్మన్ డీవీ కృష్ణరాజు, ఓఎన్జీసీ హెచ్ఆర్ అనిల్కుమార్, ఓఎన్జీసీ యూనియన్ సెక్రటరీ జె సురేష్, హితకారిణి సమాజం ఛైర్మన్ యాళ్ల ప్రదీప్, డైరెక్టర్ సాయి, తురకల నిర్మల, చుండూరి భాగ్యలక్ష్మి, మీసాల నాగమణి, నాయుడు మాస్టారు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Andrapradeshnews