5న వైసీపీ గూటికి పంచకర్ల - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

5న వైసీపీ గూటికి పంచకర్ల

విశాఖపట్టణం, అక్టోబరు 1, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీకి ఒక సామాజిక వర్గం గట్టి షాక్ ఇచ్చేలా కన్పిస్తుంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం చంద్రబాబుకు అడ్డం తిరుగుతోంది. కాపు నాయకులంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం చంద్రబాబులో కలవరం రేపుతోంది. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాపు నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీకి చెందిన కాపునేతలంతా కాకినాడలో సమావేశమయ్యారు. తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నారు. అయితే తాము టీడీపీని వీడేది లేదని అప్పట్లో చెప్పారు. ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తమను నిర్లక్ష్యం చేసిందని, నిధుల విడుదల విషయంలో తమను అలక్ష్యం చేసిందని చెప్పుకొచ్చారు. 
 5న వైసీపీ గూటికి పంచకర్ల

తర్వాత చంద్రబాబును సయితం కలిశారు. అప్పటి సమావేశంలో తోట త్రిమూర్తుల, పంచకర్ల రమేష్ బాబు, గంటా శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, జ్యోతుల నెహ్రూ వంటి నేతలు ఉన్నారు.కట్ చేస్తే తోట త్రిమూర్తులు ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. ఇక అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సయితం వచ్చే నెల 5వ తేదీ లేదా ఆరోతేదీన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో మాట్లాడారు. జగన్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటున్నారు. పంచకర్ల రమేష్ బాబు గంటా శ్రీనివాసరావు గ్యాంగ్ లో ఒకరు. గంటా శ్రీనివాసరావు సిఫార్సుతోనే అప్పట్లో ప్రజారాజ్యం, ఆ తర్వాత టీడీపీలో చేరారు.ఇక గంటా శ్రీనివాసరావు కూడా త్వరలోనే టీడీపీని వీడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు కూడా జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు చెబుతున్నారు. కొంతపేరున్న కాపు నేతలందరూ వరస బెట్టి పార్టీని వీడుతుండటం అధినేత చంద్రబాబులో ఆందోళన కల్గిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో బలమైన సామాజికవర్గం నేతలు పార్టీకి దూరమవుతుండటంతో చంద్రబాబుకు కంటి మీద కునుకులేదు. మరి వీరి తర్వాత బోండా ఉమామహేశ్వరరావు పేరు కూడా ప్రముఖంగా విన్పిస్తుంది. వీరంతా తమ సామాజిక వర్గానికి చెందిన పార్టీ ఉండగా వైసీపీని ఎంచుకుంటుండటం విశేషం.