న్యూ ఢిల్లీ జనవరి 6 (way2newstv.com)
సుప్రీంకోర్టు శీతాకాల సెలవులు ఆదివారంతో ముగిశాయి. నూతన ఏడాదిలో నేటి నుంచే సర్వోన్నత న్యాయస్థానం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న పౌరచట్ట సవరణ, ఆర్టికల్ 370 రద్దు అంశాలపై ఈ నెలలోనే సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.సోమవారం కార్యకలాపాల్లో భాగంగా టాటా గ్రూప్ ఛైర్మన్గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలన్న ఎన్సీఎల్ఏటీ తీర్పును సవాలు చేస్తూ టాటాసన్స్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించనున్నారు.
సెలవుల అనంతరం తెరుచుకున్న సుప్రీంకోర్టు
దీనితోపాటు ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో క్రిమిలేయర్ విధానాన్ని వర్తింపజేయడంపైనా నేడు విచారణ జరగుతుంది. ఢిల్లీ వాయు కాల్యుష్యంపైన కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశముంది.ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జనవరి 21న జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశముంది. కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ సహా పలువులు సామాజిక ఉద్యమకారులు, న్యాయవాదులు ఆర్టికల్ రద్దుపై పిటిషన్లు దాఖలు చేశారు. పౌరసత్వ చట్ట సవరణ రాజ్యాంగ బద్ధతపై జనవరి 22న ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించడంపై ఈ ఏడాదిలోనే సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనుంది. ముస్లిం, పార్శీ మహిళలపై నెలకొన్న వివక్షను విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం సూచనల మేరకు సుప్రీంకోర్టు ఈ ఏర్పాటు చేయనున్నది.