హైదరాబాద్, జూలై 24 (way2newstv.com)
ఆగస్టు 5 న సంగారెడ్డి జిల్లా కంది లో గల హైదరాబాద్ ఐఐటీ లో నిర్వహించబోయే 7వ స్నాతకోత్సవం లో పాల్గొనే నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్ర పర్యటనకు వస్తున్న సందర్భంగా అన్ని శాఖలు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్ల పై సోమవారం సచివాలయం లో వివిధ శాఖల అధికారుల తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ , ప్రోటోకాల్, పోలీస్, జి.హెచ్.ఎం.సి., మెట్రో వాటర్ వర్క్స్, వైద్య , ఆర్ అండ్ బి, సమాచార పౌర సంబంధాలు, టి.ఎస్.ఎస్ పిడిసిఎల్, ,బి.ఎస్.ఎన్.ఎల్, ఫైర్ , రెవెన్యూ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.
రాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సమీక్ష
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రపతి ఆగస్టు 4, 5 తేదీలలో రాష్ట్ర పర్యటనకు సంబంధించి అవసరమైన సిబ్బంది, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, గౌరవ రాష్ట్రపతి ప్రయాణించే మార్గాలలో రోడ్లకు మరమ్మత్తులు, అవసరమైన హెలిపాడ్ ల ఏర్పాటు, నిరంతర విద్యుత్ సరఫరా , అగ్నిమాపక యంత్రాల ఏర్పాటు, మంచి నీటి వసతి ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత కోసం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలన్నారు. సమాచార శాఖ ద్వారా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు, లైవ్ కవరేజీ ఏర్పాటు కు తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రపతి ఆగస్టు 4 తేదీ న సాయంత్రం బేగంపేట విమానాశ్రయం చేరుకొని రాజ్ భవన్ లో బస చేస్తారని తెలిపారు. 5 వ తేదీ న ఉదయం బొల్లారం లోని రాష్ట్రపతి నిలయంలో మొక్కలు నాటుతారని, అనంతరం కందిలోని ఐఐటీ లో జరుగనున్న 7వ కాన్వకేషన్ లో పాల్గొంటారని తెలిపారు. బొల్లారంలో ఏర్పాట్ల పై హైదరాబాద్ కలెక్టర్ , కందిలో ఏర్పాట్ల పై సంగారెడ్డి కలెక్టర్ వివిధ శాఖల తో సమావేశాలు నిర్వహించాలని అన్నారు.
ఈ సమావేశంలో డి.జి.పి. మహేందర్ రెడ్డి, ముఖ్యకార్యదర్శులు అధర్ సిన్హా , హర్ ప్రీత్ సింగ్ , సునీల్ శర్మ, రాజీవ్ త్రివేది, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, రాచకొండ కమీషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ , హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీసు అంజనీకుమార్ , అడిషనల్ డి.జి. (లా అండ్ ఆర్డర్) జితేందర్ , హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా , సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్.పి. చంద్రశేఖర్ రెడ్డి, పి.సి.సి.ఎఫ్ పి.కె.ఝా, టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్. సి.యండి రఘుమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.