ఖమ్మం, ఫిబ్రవరి 21 (way2newstv.com)
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న సామెతను నిజం చేస్తుంది ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్. బతుకు దెరువు కోసం పల్లెల నుంచి పట్నానికి వచ్చి అడ్డాకూలీలుగా పనిచేస్తూ అన్నం కొసం అలమటిస్తున్న వారికి నగరంలో మేమున్నామంటూ భరోసా ఇస్తుంది ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్. పూటకు పట్టెడన్నం కోసం ఆరాట పడుతున్న వారికి ఆపన్నహస్తం అందించడానికి ఒక బృహత్తర పథకానికి నాంధి పలికింది. ఆ పథకమే ఐదు రూపాయలకే భోజనం పథకం. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూ.5 భోజనంను గురువారం లాంఛనంగా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపలాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదకు తక్కువ ధరకు భోజనాన్ని అందించే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
రూ 5 కే భోజన పథకం ఖమ్మం లో ప్రారంభం
ఐదు రూపాయలకే వేడివేడి భోజనం పథకంను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుందన్నారు. నగరంలో ఐదు ప్రాంతాల్లో అమలుకు ప్రణాళికలు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు 2 వేల మందికి భోజన అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఐదు రూపాయలకు సింగిల్ చాయ్ కూడా రాని ఈ రోజుల్లో నిరుపేదల కడుపు నింపాలని నిర్ణయించిందని, నిరుపేదలకు, అడ్డా కూలీలకు, చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఫుట్ పాత్లపై నివసించే వారికి, యాచకుల కోసం కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన రుచికర భోజనాన్ని అందిస్తూ తెరాస ప్రభుత్వం వారికి అండగా నిలిచిందన్నారు. కేవలం వీరి కోసమే కాకుండా అనారోగ్య సమస్యలతో వైద్య సేవలకోసం నగరానికి వచ్చే రోగులకు, వారి కుటుంబ సభ్యులకు సైతం ఈ భోజనాన్ని అందించడానికి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద సైతం ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. పేద ప్రజలకు కడుపునిండా అన్నంపెట్టే ఈ 5రూపాలయకే భోజన పథకంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇస్కాన్ వారి అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి సహకారంతో భోజనాన్ని అందజేస్తున్నారు. అన్నం, పప్పు, సాంబర్, కూరగాయలను రుచికరమైన భోజనాన్ని ఆయా సెంటర్లకు ఫౌండేషన్ చేరవేస్తుంది ఈ ఫౌండేషన్. ప్రతి ఒక్కరికి 20 రూపాయల ఖర్చవుతుండగా కేవలం 5 రూపాయలను వినియోగదారుడు చెల్లిస్తే మిగతా 15 రూపాయలను సబ్సీడి కింద అక్షయ పాత్ర ఫౌండేషన్కు ప్రభుత్వం ఇస్దుంది. . ఈ పథకానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సమర్థవంతంగా అమలు జరిగేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.