హైదరాబాద్, ఫిబ్రవరి 13, (way2newstv.com)
తెలంగాణలోని వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు ఐక్యరాజ్య సమితి ప్రొక్యూర్ మెంట్ డివిజన్ కు సంబంధించిన వాణిజ్య అవకాశాలను పొందటానికి అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని, వారికి సరైన అవగాహనను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి కోరారు.
ఐరాస వాణిజ్య అవకాశాలపై భేటీ
బుధవారం సచివాలయంలో యునైటెడ్ నేషన్స్ ప్రొక్యూర్ మెంట్ ఆఫీసర్ బ్రోనో మబోజా సియస్ ను కలిసారు. యునైటెడ్ నేషన్స్ ప్రొక్యూర్ మెంట్ డివిజన్ ద్వారా వివిధ ఐరాస సంస్ధలకు ఐసీటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రికల్, పవర్, ఆఫీస్ ఎక్విప్ మెంట్, ట్రైనింగ్ అండ్ కన్సల్ టెన్సి, ఇంజనీరింగ్ సర్వీసెన్, ఫుడ్ వంటి తదితర రంగాలలో ఉన్న అవకాశాలను తెలంగాణ వాణిజ్యవేత్తలు పొందేలా తగు ప్రచారాన్ని నిర్వహించాలని సి.యస్ వారిని కోరారు.
ఐక్యరాజ్య సమితి వాణిజ్య అవకాశాలపై హైదరాబాద్ లో సెమినార్ నిర్వహించడం అభినందనీయమని, వాణిజ్యవేత్తలకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని, వివరాలతో కూడిన హ్యండ్ బుక్ ను అందజేయాలని సి.యస్ వారిని కోరారు. తెలంగాణ వాణిజ్యవేత్తలు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్నారని, వారికి ఇదొక మంచి అవకాశమని సి.యస్ అన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ది చెందుతుందని టి-హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ను సందర్శించాలని సి.యస్ వారిని కోరారు. సెమినార్ అనంతరం వివరాలను ఇవ్వాలని కోరారు.