ఓటింగ్‌ను పెంచాలని ప్రముఖులకు ప్రదాని మోదీ విజ్ఞప్తి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఓటింగ్‌ను పెంచాలని ప్రముఖులకు ప్రదాని మోదీ విజ్ఞప్తి

ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకం
న్యూఢిల్లీ మార్చ్ 13 (way2newstv.com)    
ఓటు.. సామాన్యుడి పాశుపతాస్త్రం.. ప్రజాస్వామ్యానికి మూలాధారం. అలాంటి ఓటు హక్కును ప్రతి భారతీయుడు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభ్యర్ధించారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఓటు హక్కుపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి, ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేలా చూడాలని రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు మోదీ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమ్‌బంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేసీఆర్‌, చంద్రబాబు సహా ట్విటర్‌ వేదికగా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభ్యర్థించారు.‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేలా ఓటర్లను ప్రోత్సహించాలని రాహుల్‌గాంధీ, మమతాబెనర్జీ, శరద్‌ పవార్‌, మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, స్టాలిన్‌ తదితరులను కోరుతున్నా. దేశవ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలను పెంచాలి. రాష్ట్రాల్లో పోలింగ్‌ బూత్‌లకు ఎక్కువ మంది వచ్చేలా కృషి చేయాలని కేసీఆర్‌, నవీన్‌ పట్నాయక్‌, కుమారస్వామి, చంద్రబాబు, జగన్‌, నితీశ్‌ కుమార్‌ తదితరులను కోరుతున్నా’ అని మోదీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. 


ఓటింగ్‌ను పెంచాలని ప్రముఖులకు ప్రదాని మోదీ విజ్ఞప్తి

రాజకీయ నాయకులనే కాదు సినీ, క్రీడా ప్రముఖులను కూడా మోదీ అభ్యర్థించారు. ‘మోహన్‌లాల్‌, నాగార్జున గారు.. మీ ప్రదర్శనలతో కోట్ల మంది అభిమానులను ఆనందపరుస్తున్నారు. అందుకు ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. మీ లాంటివారు ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని మరో ట్వీట్‌లో మోదీ కోరారు. షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌, క్రీడా ప్రముఖులు సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, అనిల్‌ కుంబ్లే, క్రికెటర్లు ధోనీ, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, ఫోగట్‌ సోదరీమణులు గీతా, బబిత, విన్నేశ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు దీపికా పదుకొణె, ఆలియా భట్‌, అనుష్క శర్మ, అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ఖాన్‌, ఆమీర్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, షారూక్ ఖాన్‌, కరణ్‌ జోహార్‌ తదితరులను మోదీ అభ్యర్థించారు. ప్రజాస్వామ్య దేశంలో మీడియా సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ ఈ సందర్భంగా అన్నారు. ప్రజల ఆలోచనలపై మీడియా పెను ప్రభావం చూపుతోందని, అలాంటి మీడియా సంస్థలు ఓటు హక్కుపై విస్తృత ప్రచారం కల్పించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. ‘ప్రజల ఆకాంక్షలకు మీరు అక్షర రూపాన్ని ఇస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా వారిలో స్ఫూర్తి నింపండి’ అని ఈనాడు, మాతృభూమి, దినతంతి సహా పలు మీడియా సంస్థలను మోదీ కోరారు.