కల సాకారమైన వేళ (కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కల సాకారమైన వేళ (కృష్ణాజిల్లా)

మచిలీపట్నం, ఏప్రిల్ 08 (way2newstv.com):
కృష్ణా విశ్వవిద్యాలయం ఏముంది అక్కడ..అద్దె భవనాలు.. బోధన సిబ్బంది కొరత.. అంతంతమాత్రం సదుపాయాలు.. ఇదీ గతంలో మాట.. ఇపుడు సొంత భవనాలు..విద్యార్థులకు ఆహ్లాదం కలిగించే విశాలమైన ప్రాంగణం.. సమావేశాలు నిర్వహించుకునేందుకు ఐదు మందిరాలు.. సకల సదుపాయాలతో వసతులు. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు విభాగాల్లో అభివృద్ధిని సాధించి ఇతర విశ్వవిద్యాలయాలకు దీటుగా నిలుస్తోంది.
రాష్ట్రంలో చాలా విశ్వవిద్యాలయాలు వ్యక్తులు, ప్రాంతాల పేరుతోనే ఏర్పాటైతే కృష్ణా నదీమతల్లి పేరు వచ్చే విధంగా జిల్లా ప్రాభవాన్ని తెలియజేసేలా కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యింది. 2016లో ఉపకులపతిగా రామకృష్ణారావు పదవీబాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలోనే రుద్రవరంలో రూ. 72 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దాదాపు వడు సంవత్సరాల తరువాత నిర్మాణ పనులను పూర్తి చేసుకుంది. ఈ నూతన భవనాలు ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి. అందరిలోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.రుద్రవరంలోని విశ్వవిద్యాలయ శాశ్వత భవనాలు సకలహంగులతో నిర్మాణమయ్యాయి. పరిపాలనా వ్యవహారాల నిర్వహణకు అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, తరగతుల నిర్వహణకు అకడమిక్‌బ్లాక్‌ వంటివి ఏర్పాటయ్యాయి. అధునాతన గ్రంథాలయం, ప్రయోగశాలలు, విశాలమైన తరగతి గదులు, ఐదు సమావేశ మందిరాలు, ఆడిటోరియం వంటివి విద్యార్థుల కోసం ఏర్పాటయ్యాయి. కంప్యూటర్‌ల్యాబ్‌లు, ఇతర సదుపాయాల నిమిత్తం నిధులు కూడా సమకూరాయి. 


కల సాకారమైన వేళ (కృష్ణాజిల్లా)

సుందరీకరణ కోసం ఉద్యానవనశాఖ అధికారులకు అప్పగించిన నేపథ్యంలో వారు గ్రీనరీని అభివృద్ధి చేస్తున్నారు. సౌర విద్యుత్తు ప్లాంట్‌, లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్‌ప్లాంట్‌ వంటి సదుపాయాలు కొద్దిరోజుల్లోనే సమకూరనున్నాయి. మరికొన్ని వసతులను కూడా సమకూర్చే పనిలో పడ్డారు. అవి కూడా పూర్తైతే వచ్చే విద్యాసంవత్సరంలో నూతన భవనాల్లోనే విద్యాబోధన చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.ప్రభుత్వ పరంగా ఇంజినీరింగ్‌ కళాశాల లేకపోవంతో విద్యార్థులు ప్రయివేటు కళాశాలలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేది. ఏడాదిన్నర క్రితం ఈడేపల్లికి సమీపంలో తాత్కాలిక భవనంలో ఇంజినీరింగ్‌ కళాశాలను ఏర్పాటయ్యింది. ఈసీఈ, సీఎస్‌ఈ బ్రాంచిలు పెట్టి 60 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. విద్యార్థులు మంచి ఫలితాలనే సాధించడంతో ఈ విద్యాసంవత్సరంలో ఆ సంఖ్యను రెట్టింపు చేసి ప్రతి బ్రాంచిలోనూ 60 మందికి ప్రవేశాలు ఇచ్చారు. ఇక్కడ విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, గుంటూరు తదితర జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. మెకానికల్‌, సివిల్‌ బ్రాంచిలను కూడా ప్రవేశపెడితే మరింత ఉపయోగంగా ఉంటుందని విద్యార్థులు పేర్కొంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదికే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఆచార్య పోస్టులను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా విశ్వవిద్యాలయానికి కూడా 40 పోస్టులు మంజూరయ్యాయి. ఆరుగురు ఆచార్యులు, 14 మంది సహ ఆచార్యులు, 20 మంది సహాయాచార్య పోస్టులను మంజూరు చేసింది. ఆరుగురు ఆచార్యుల పోస్టులను ఇటీవల భర్తీ చేశారు. సహ ఆచార్యుల పోస్టులకు కూడా ఇంటర్వ్యూలు పూర్తికాగా న్యాయపరమైన ఇబ్బందులుండటంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. సహాయాచార్య పోస్టులకు కూడా ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. రెగ్యులర్‌ ఉపకులపతి లేకపోవడంతో పోస్టుల భర్తీ ఆగిపోయింది. బోధనవసరాలను తీర్చేందుకు 26 మంది అకడమిక్‌ కన్సల్టెంట్లను కూడా భర్తీ చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెగ్యులర్‌ ఉపకులపతి నియామకం జరిగిన వెంటనే సహాయాచార్యుల పోస్టులను భర్తీ చేయడం లాంఛనమే.విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో సైతం అసమాన విజయాలు సాధించారు. దక్షిణ భారత అంతర్‌ విశ్వవిద్యాలయాల హ్యాండ్‌బాల్‌ పోటీల ఛాంపియన్‌షిప్‌ను విశ్వవిద్యాలయం దక్కించుకుంది. వాలీబాల్‌లో వడో, ఖోఖోలో నాలుగోస్థానంలో నిలిచారు. క్రికెట్‌లో వర్సిటీ మహిళా క్రీడాకారిణులు రెండో స్థానం సాధించారు. విలువిద్యలో నవీన్‌, అనూషల జోడి పతకాలు కొల్లగొట్టింది. మరింత మెరుగైన శిక్షణ అందించేందుకు క్యాంపస్‌, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికతన పీడీ పోస్టులను భర్తీ చేశారు.