విజయనగరం, మే 14, (way2newstv.com)
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో నాయకుల వారసులు రంగంలోకిదిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గడిచిన 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకులు ఈ దఫా తాము తప్పుకొని మరీ తమ వారసులకు అవకాశం ఇప్పించుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో వారసులు పోటీ చేశారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలోని కీలకమైన టీడీపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్గజపతిరాజు కూడా తన వారసురాలు అదితి విజయలక్ష్మిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు. విజయనగరం జిల్లా కేంద్రమైన విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి ఆమెను రంగంలోకి దింపారు. అశోక్ కూడా విజయనగరం ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. తొలిసారి తన కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి రావడంతో ఇక్కడ పాలిటిక్స్లో జోష్ పెరిగింది. ముఖ్యంగా అదితికి సీటు ఇప్పించుకోవడం దగ్గర నుంచి ఆమె గెలిపించుకునే వరకు అశోక్ వ్యూహ.. ప్రతివ్యూహాలతో రంగంలోకి వచ్చారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం పూసపాటి ఫ్యామిలీకి కంచుకోట. ఇక్కడ నుంచి కేవ లం ఒక్కసారి మాత్రమే ఓటమి ఎదుర్కొని మిగిలి ఐదు నుంచి ఆరు సార్లు జరిగిన ఎన్నికల్లో అశోక్ విజయం సాధిం చారు. రాష్ట్రంలో టీడీపీలో ఎక్కువసార్లు గెలిచిన వారిలో రెండో స్థానంలోకూడా నిలిచారు.
అశోక్ వారసురాలుకు పట్టం కడతారా
అనేక మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి పట్టున్న నియోజకవర్గం నుంచి తన కుమార్తెను అశోక్ బరిలో నిలపడం సంచలనంగా మారింది.ఇక్కడ సీటు కోసమే అశోక్ అధిష్టానంతో ఓ చిన్నపాటి యుద్ధం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతను పక్కన పెట్టిన బాబు అదితికి సీటు ఇచ్చారు. ఇక, ఎన్నికల ప్రచారంలోనూ తండ్రీ కూతుళ్లు ఇద్దరూ ప్రజలను ఆకట్టుకున్నారు. ఉమ్మడిగా నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన కూడా వచ్చింది. పోలింగ్ అయినప్పటికీ.. అదితిలో మాత్రం టెన్షన్ నెలకొందని అంటున్నారు. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామి.. గట్టి పోటీ ఇచ్చారు. స్థానికుడు కావడం, బలమైన వర్గం ఉండడం, గత ఎన్నికల్లో విజయం సాధించిన కారణంగా ఈయన కూడా గట్టిగానే ప్రయత్నించారు. ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఆయన అక్కున చేర్చుకున్నారు.2004 ఎన్నికల్లో గెలిచిన కోలగట్ల గత రెండు ఎన్నికల్లోనూ ఓడిపోతూ వస్తున్నారు. ఆ తర్వాత జగన్ ఎమ్మెల్సీ ఇచ్చినా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు గత రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. పైగా గత రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయారన్న సానుభూతి ఆయనపై ఎక్కువుగా ఉంది. జగన్ నవరత్నాలు సహా వైసీపీ పథకాలను, మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లారు. ప్రచారం కూడా భారీగానే చేశారు. దీంతో ఇక్కడ అదితి గెలుపు నల్లేరుపై నడక మాత్రం కాబోదని అంటున్నారు. అదితికి ఉన్న ఆశ ఏంటంటే నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ వర్గంలో పట్టున్న బొత్స టీడీపీకి ఇంటర్నల్గా సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ సమరంలో రాజు గారి కుమార్తె గెలుస్తారా ? లేదో ? చూడాలి.