ఫీజుల విషయంలో ఏర్పడిన గందరగోళం నేపథ్యంలో తెలంగాణ ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, జూలై 1 నుంచి 4 వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చు కోవచ్చని అధికారులు ప్రకటించారు. ధ్రువపత్రాల పరిశీలన మాత్రం యథావిధిగా జరగనుంది. షెడ్యూల్ ప్రకారం మొదటి దశ కౌన్సెలింగ్లో భాగంగా ఈ రోజు నుంచి జూలై 4వ తేదీ వరకు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలనతో పాటు కాలేజీల ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉంది.
జూలై 1 నుంచి వెబ్ ఆప్షన్లు
ఇంజనీరింగ్ కాలేజీలకు నూతన ఫీజులు ఖరారు చేయకపోవడంతో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన జరిపిన హైకోర్టు.. కాలేజీలు ప్రతిపాదించిన ఫీజునే అమలు చేయాలని ఆదేశించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై భారీగా భారం పడనుంది. ఈ నేపథ్యంలో తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తప్పని పరిస్థితుల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. టీఏఎఫ్ఆర్సీ ఛైర్మన్ నియామకం జరిగి ఫీజులు ఖరారు చేసేవరకు పాత ఫీజులనే అమలు చేయాలని ప్రభుత్వం అప్పీలుకు వెళ్లనుంది. తీర్పు కాపీ బుధవారం రాత్రి అందిందని, దీనిపై గురువారం అప్పీల్కు వెళ్తున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు.
Tags:
telangananews