ప్రపంచంలోనే నెంబర్ వన్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రపంచంలోనే నెంబర్ వన్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం


కరీంనగర్, జూన్ 20, (way2newstv.com)
ప్రపంచంలో అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు అని గూగుల్ సెర్చ్ చెబుతోంది.ఇప్పటి వరకు అమెరికాలోని కొలరాడో, ఈజిప్టులోని గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్‌లో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు మాత్రమే ప్రపంచంలో అతి పెద్దవిగా రికార్డు ఉంది.13 జిల్లాల్లో 18,25,000 ఎకరాలకు నీరందించే ఈ భారీ ప్రాజెక్టును శుక్రవారం ప్రారంభించనున్నారు.తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచాన్నే అబ్బురపరుస్తోంది. కనివినీ ఎరుగని ఈ ఇంజినీరింగ్ అద్భుతం చాలా తక్కువ సమయంలోనే సిద్ధం కావడం ఒక రికార్డు కాగా.. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌గా సరికొత్త రికార్డును కూడా సొంతం చేసుకోడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ‘గూగుల్’ సెర్చ్‌లో అతి పెద్ద  లిఫ్ట్ ఇరిగేషన్ గా టాప్‌ స్థానంలో నిలిచింది. ఎత్తిపోతల పథకం (లిఫ్ట్ ఇరిగేషన్) అంటే సాధారణ డ్యామ్‌లు నిర్మించినంత ఈజీ కాదు. 


ప్రపంచంలోనే నెంబర్ వన్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం

దీని నిర్మాణం ఎంతో క్లిష్టంగా ఉంటుంది. కొన్ని వందల గ్యాలాన్ల నీటిని నది నుంచి తోడి ఎగువ ప్రాంతానికి పంపాలంటే భారీ మోటార్లు, పైపులు అవసరం అవుతాయి. పైగా ఎత్తుపల్లాలు అధికంగా ఉండే భూముల్లో ఈ పనులు చేపట్టడం మరింత కష్టం. అయితే, ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా కాళేశ్వరాన్ని విజయవంతంగా పూర్తిచేయడం గమనార్హం. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రీడిజైన్ చేయించారు. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్‌రావు పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో స్వల్ప కాలంలోనే భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది.  ఇప్పటి వరకు అమెరికాలోని కొలరాడో, ఈజిప్టులోని గ్రేట్ మ్యాన్ మేడ్ నదిలో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు మాత్రమే ప్రపంచంలో అతి పెద్దవిగా రికార్డు ఉంది. అయితే, కాళేశ్వరమే అతి పెద్ద  లిఫ్ట్ ఇరిగేషన్ అనే విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు గూగుల్‌లో ఇంతగా ట్రెండవ్వడానికి కారణాలు తెలుసుకోవాలంటే.. ఈ ప్రత్యేకతలు తెలుసుకోవలసిందే. 
‘కాళేశ్వరం’.. ప్రాజెక్ట్ కాదిది, ఇంజినీరింగ్ అద్భుతం: 
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిలో 3 బ్యారేజీలు, 19 పంప్ హౌజ్‌లు నిర్మించారు.
వందల కిలోమీటర్ల పొడవున కాలువలు నిర్మించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే 13 జిల్లాల్లో 18,25,000 ఎకరాలకు నీరందించవచ్చు.
ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 1,832 కిమీలు నీటి సరఫరా జరగనుంది.
1,531 కిమీల పొడవున కాలువలు, 203 కిమీల పొడవున సొరంగ కాలువలను నిర్మించారు. మరో 98 కిమీలు పైపులైన్లు ఏర్పాటు చేశారు.
19 పంపు హౌస్‌లు, 20 లిఫ్టులతో ఈ పథకాన్ని నిర్వహిస్తారు.
ఈ ప్రాజెక్టు కోసం కొత్తగా 20 జలాశయాలు నిర్మిస్తున్నారు.
ప్రాజెక్టులో మొత్తం 225 టీఎంసీల నీటిని వినియోగిస్తారు.
మొత్తం 70 వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.
నీటిని చేరవేసేందుకు నిర్మించిన సొరంగాలు, కాలువలను చెరువులు, జలాశయాలకు అనుసంధించారు.
ఈ పనులను 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించారు.
ఇది పూర్తయితే దక్షిణ తెలంగాణ వరకు గోదావరి నీరు అందుతుంది. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. హైదరాబాద్, షామీర్‌పేట, చిట్యాల వరకు నీళ్లు వస్తాయి.
గోదావరిలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాంతాల్లో బ్యారేజీలు నిర్మించారు.
దిగువ ఉండే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటి తోడి ఎగువున ఉన్న బ్యారేజీలోకి వదులుతారు.
ఈ మూడు బ్యారేజీల వల్ల గోదావ‌రిలో దాదాపు 130 కిలోమీటర్ల వరకు నిత్యం నీరు ఉంటుంది.
ఈ పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు.
గోదావ‌రి నీరు వృథా కాకుండా సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా 100 మీట‌ర్ల నుంచి 623 మీట‌ర్ల వ‌ర‌కు నీటిని ఎగువ గోదావరిపై నిర్మించిన బ్యారేజీలోకి ఎత్తిపోయనున్నారు.
ఈ ప్రాజెక్టులో నీటి ఎత్తిపోసే పంపుల నిర్వహణకు 4,600 మెగావాట్ల విద్యుత్ అవసరం.
ఈ ప్రాజెక్టులో నిర్మించిన సొరంగాలు, సర్జ్‌పూల్ (నీటి అడుగు జలాశయం), గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌లు, భారీ పంపులు కీలక పాత్ర పోషించనున్నాయి.
ఈ పథకం కోసం భూమి అడుగున పది మీటర్ల వ్యాసంతో 203 కిలోమీటర్ల మేర సొరంగాలు నిర్మించారు. నీటి తరలింపునకు ఇప్పటి వరకు ఇలాంటి సొరంగం ఎక్కడా లేదు
ఈ ప్రాజెక్టులో మోటార్లు భారీ అంతస్తులను తలపిస్తాయి. వాటికి అమర్చే పంపులు చిన్న సైజు భవనాల్లా ఉంటాయి.
139 మెగావాట్ల సామర్థ్యం గల ఏడు పంపులను ఇందులో వాడుతున్నారు.
ఈ ప్రాజెక్టును మొత్తం రూ.80,500 కోట్ల వ్యయంతో చేపట్టారు.
గోదావరిపై అత్యంత వేగంగా పూర్తి చేసిన బ్యారేజీలుగా ఈ ప్రాజెక్టుకు గుర్తింపు లభించనుంది