మూడు బ్లాకుల్లో తెలంగాణ సచివాలయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మూడు బ్లాకుల్లో తెలంగాణ సచివాలయం


5.6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం
మరి కాసేపట్లో శంకుస్థాపన పనులు
హైద్రాబాద్, జూన్ 26 (way2newstv.com
తెలంగాణలో నూతన సచివాలయం, అసెంబ్లీ భవనాల శంకుస్థాపనకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు ప్రస్తుతం సచివాలయంలోని కార్యాలయాలను తాత్కాలికంగా ఎక్కడకు తరలించాలి? మొత్తం సచివాలయ భవనాలను ఒకేసారి కూల్చివేయాలా? లేక విడుతలవారీగా కూల్చాలా? అన్నదానిని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయిస్తుంది. మొత్తం కార్యాలయాలను ఒకేసారి తరలించకుండా మొదట ఏ, బీ, సీ బ్లాక్‌లలోని కార్యాలయాలను ఎల్, జే, డీ బ్లాక్‌లకు తరలించి.. ఏ,బీ,సీ,కే బ్లాక్‌లను కూల్చివేయాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూడుబ్లాక్‌లు కలిపితే 5.6 లక్షల చదరపు అడుగులు ఉంటుందని చెప్తున్నారు. అయితే నిర్మాణ సమయంలో ఈ స్థలంలోని ఇతర బ్లాక్‌లలో కార్యాలయాలు ఉండటం భద్రత కారణాలరీత్యా మంచిది కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నదిఈ నెల 27వ తేదీన రెండు భవనాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భూమిపూజ నిర్వహించనున్నారు. ఇప్పుడున్న ప్రాంగణంలోనే సచివాలయం, ఎర్రమంజిల్‌లో అసెంబ్లీకి నూతన భవనాలను నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ముందుగా సచివాలయ భవననిర్మాణానికి భూమిపూజచేస్తారు.


మూడు బ్లాకుల్లో తెలంగాణ సచివాలయం
ఇందుకోసం సచివాలయంలో ఈశాన్యంలో డీ బ్లాక్ వెనుకవైపుఉన్న ఉద్యానవనంలో ఏర్పాట్లుచేస్తున్నారు. అనంతరం ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవన నిర్మాణపనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రగతిభవన్‌లో లంచ్ ఏర్పాటుచేశారు. నూతన సచివాలయాన్ని సుమారు ఆరులక్షల చదరపు అడుగుల వైశాల్యంతో అన్నిహంగులతో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. పక్కావాస్తుతోపాటు అన్నిరకాల వసతులు ఉండేలా నిర్మించనున్నారు. మంత్రులు, అధికారుల సమీక్షలు, సమావేశాలు అన్నీ సచివాలయం వేదికగా జరిగేలా నిర్మాణం జరుగనున్నది. ఇందుకోసం సమావేశహాళ్లు, కలెక్టర్ల సమావేశం కోసం కాన్ఫరెన్స్‌హాల్ నిర్మించనున్నారు. అలాగే విశాలమైన పార్కింగ్ ఏర్పాటుకూడా చేయనున్నారు. పూర్తి పర్యావరణ హితంగా సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సచివాలయం ప్రాంగణంలో ఉన్న భారీ వృక్షాలను ట్రాన్స్‌రిలోకేషన్ పద్ధతిలో సంరక్షించాలని అధికారులు యోచిస్తున్నారు.భవనాలు అన్నింటినీ ఒకేసారి కూల్చకుండా.. విడుతల వారీగా కూల్చి నిర్మాణం చేపడితే .. భారీయంత్రాలను వినియోగించి రెండోవిడుతలో నిర్మించే భవనాలను కూల్చేసమయంలో మొదటి విడుతలో నిర్మించిన భవనాలకు పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంటుందని మరో ఆలోచన కూడా చేస్తున్నారు. ఈ విధంగా అన్నిరకాల విషయాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించి సచివాలయ తరలింపుపై నిర్ణయిం తీసుకోనున్నది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా సచివాలయంలోని కార్యాలయాలను తరలింపుపై నిర్ణయం తీసుకుంటారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సచివాలయం మొత్తాన్ని ఒకేసారి తరలించి, కూల్చాలని నిర్ణయిస్తే మంత్రిత్వశాఖలను ఆయా శాఖాధిపతుల కార్యాలయాలకు తలించాల్సి ఉంటుంది. ఇదేసమయంలో జీఏడీ, ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కార్యాలయాలను ఎక్కడికి తరలించాలన్న దానిపై కూడా మంత్రివర్గ ఉపసంఘం చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.