రాకెట్ లా దూసుకెళ్లిన బిట్‌కాయిన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాకెట్ లా దూసుకెళ్లిన బిట్‌కాయిన్


ముంబై, జూన్ 24, (way2newstv.com
క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ మళ్లీ జోరు పెంచి రాకెట్‌లా దూసుకెళ్తోంది. కొద్ది నెలలుగా డీలాపడి ఉన్న ఈ క్రిప్టోకరెన్సీ విలువ అమాంతం పెరిగింది. 15 నెలల్లో తొలిసారిగా ఈ కరెన్సీ విలువ 10వేల డాలర్ల మార్కును దాటింది. బిట్‌కాయిన్‌ను కొన్ని దేశాలు నిషేధిస్తున్న వార్తలు వెలువడడం, క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధత లేదనే విమర్శలు వెరసి గతేడాదిలో క్రిప్టోకరెన్సీ బుడగ పేలిపోయింది. క్రమంగా విలువ తగ్గుతూ వచ్చింది. అయితే మళ్లీ అనూహ్యంగా బిట్‌కాయిల్ పుంజుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శనివారం ఉదయం 8.94 శాతం పెరిగి 10,591 డాలర్లకు చేరినట్లు క్రిప్టో కరెన్సీ ట్రాకింగ్ వెబ్‌సైట్ కాయిన్ మార్కెట్‌కాప్ వెల్లడించింది.సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ లిబ్రా పేరుతో క్రిప్టోకరెన్సీని తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ బిట్‌కాయిన్ ధర కూడా పుంజుకోవడం విశేషం. 


రాకెట్ లా దూసుకెళ్లిన బిట్‌కాయిన్ 
2008లో తయారు చేసిన బిట్‌కాయిన్ 2011లో ఒక డాలర్‌కు ఒక బిట్‌కాయిన్ లభించేది. ఆ తర్వాత దీని విలువ పెరుగుతూ 2017నాటికి ఒక బిట్‌కాయిన్ 20వేల డాలర్ల స్థాయికి చేరింది. అయితే చాలా దేశాలు క్రిప్టోకరెన్సీలపై ఆంక్షలు విధించడంతో దీని విలువ క్రమంగా పతనమైంది. 2018 డిసెంబర్‌లో అత్యల్పంగా 3,250 వద్ద ట్రేడైంది. దీంతో ఈ కరెన్సీ ఇక ఎప్పటికీ పుంజుకోదని చాలా మంది నిపుణులు పేర్కొన్నారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ బిట్‌కాయిన్ ర్యాలీ మొదలుపెట్టింది. మూడు వారాల క్రితమే 8,700 డాలర్ల మార్కును దాటేసింది.మళ్లీ బిట్‌కాయిల్ విలువ పుంజుకోవడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా అమెరికా-,చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో బిట్‌కాయిన్‌ను సురక్షితమైందిగా ఎంచుకోవడం ఒకటి, ప్రముఖ బ్రోకరేజీ సంస్థ అయిన ఫిడెలిటీతోపాటు ఇతర బ్రోకరేజీ సంస్థలు కూడా క్రిప్టోకరెన్సీల కొనుగోళ్లు విక్రయాలకు అనుమతించడమూ మరో కారణమైంది. ఇక ఫేస్‌బుక్ కూడా క్రిప్టోకరెన్సీ తీసుకొస్తున్నట్లు ప్రకటించడం, దీనికోసం చెల్లింపు సేవల సంస్థలను, ఈ కామర్స్ సంస్థలను, క్రిప్టోకరెన్సీ సంస్థలను భాగస్వాములుగా చేసుకోవడంతో బిట్‌కాయిన్‌కు సానుకూలంగా మారాయి. అయితే బిట్‌కాయన్ల లావాదేవీలు భారత్‌లో చట్టబద్ధం కాదు.