ఒంగోలు, జూలై 26, (way2newstv.com)
ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం జూలై నెల పూర్తి కావస్తున్నా అధ్యాపకులు నియామకంపై ఉత్తర్వులు ఇవ్వలేదు. జూనియర్ కళాశాలలు తెరచి రెండు నెలలు పూర్తి కావస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు కాంట్రాక్టు అధ్యాపకుల సేవలను వినియోగించుకున్న ప్రభుత్వం ఇటీవలే ఆ మూడు నెలల వేతనాన్ని విడుదల చేసింది. ఏప్రిల్లో విద్యా సంవత్సరం ముగిసిపోగా జూన్ వరకు ఎలాంటి వేతనాలు లేవు. ఆ సమయంలో అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ ఉపాధి దొరక్క వారి కుటుంబాల ఆకలితో అలమటించాయి. జిల్లాలో 30 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో శాశ్వత ప్రాతిపదికన కేవలం 107 మంది అధ్యాపకులుండగా 241 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారు. అన్ని కళాశాలల్లో కలిపి సుమారు 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మద్దిపాడు జూనియర్ కళాశాలలో అందరూ రెగ్యులర్ అధ్యాపకులే ఉండగా అక్కడ విద్యార్థుల సంఖ్య మాత్రం నామమాత్రంగా ఉంది.
కాంట్రాక్ట్ లెక్చరర్ల నియామకంపై సీత కన్ను
దొనకొండ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ మినహా మిగిలిన అధ్యాపకులందరూ కాంట్రాక్ట్ వారే. గతేడాది పని చేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు సాధారణంగానే ఈ ఏడాది కూడా కొనసాగేలా జూన్ మొదటి వారంలోనే బాండ్లు తీసుకుంటారు. కానీ జూలై ఆఖరికి కూడా రెన్యువల్ జీవో విడుదల కాలేదు. మొదటి నెల వేతనం ఇంకా వారి ఖాతాలో పడలేదు. ఉద్యోగ భద్రత లేక, కుటుంబ పోషణ భారమై ఆర్థికంగా, మానసికంగా ఆవేదన చెందుతున్నారు. జూన్ నెలలో తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ఫీజులు, పుస్తకాలు, దుస్తులు కొనుగోలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందించాలన్న నిబంధన అమలు కావడం లేదు. గతేడాది వరకు నెలకు రూ.18 వేలు వేతనం అమలైంది. తెలంగాణ తరహాలో టీచర్లకు ఎందుకు అమలు చేయడం లేదని జూనియర్ లెక్చరర్ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చే వేతనం కూడా మూడు నెలలకొకసారి, ఆరు నెలలకొకసారి ఇస్తున్నారు. మహిళా అధ్యాపకులకు ప్రసూతి సెలవులు ఇవ్వకపోవడంతో జీతం లేని సెలవులు పెట్టుకోవాల్సి వస్తోంది.ప్రభుత్వ కళాశాలల్లో ప్రధాన బోధకులు కాంట్రాక్ట్ అధ్యాపకులే కావడం, వారికి రెన్యువల్ ఉత్తర్వులు రాకపోవడంతో పర్యవేక్షణ గాడి తప్పింది. వీరికి బయోమెట్రిక్ హాజరు విధానం లేదు. వచ్చే నెల నుంచి అధ్యాపకులకు, పిల్లలకు బయోమెట్రిక్ విధానం వస్తుందని అధికారులు చెప్తున్నారు. రెన్యువల్ విషయంపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అధ్యాపకులు ఉంటారా.. ఉండరా అనే అనుమానం విద్యార్థుల్లో కూడా వ్యక్తమవుతోంది. రెన్యువల్ ఉత్తర్వులు రాకపోవడంతో బోధన కుంటుపడుతుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కుటుంబ పోషణ జరగని అధ్యాపకులు ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు గెస్ట్లుగా తరగతులు బోధించడం, ఇతరత్రా పనుల్లో ఉంటున్నారు. అంతిమంగా విద్యార్థులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోకపోగా సమస్యలను కూడా తీర్చడం లేదు
Tags:
Andrapradeshnews