రీవెంజ్ పాలిటిక్స్... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రీవెంజ్ పాలిటిక్స్...

అమిత్ షా వర్సెస్ చిదంబరం
న్యూఢిల్లీ, ఆగస్టు 22(way2newstv.com)
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు నిరాకరించడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బుధవారం రాత్రి ఏఐసీసీ ఆఫీసులో ప్రత్యక్షమైన చిదంబరం.. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తాను దోషిని కాదన్నారు. ఏఐసీసీ ఆఫీసుకి సీబీఐ, ఈడీ అధికారులు చేరుకునే లోపే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోవడంతో... చిదంబరం నివాసానికి వెళ్లిన దర్యాప్తు అధికారులు గోడ దూకి మరీ ఆయన్ను అరెస్ట్ చేశారు. యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లపాటు చిదంబరం ఓ వెలుగు వెలిగారు. హోం మంత్రిగా, ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలను నిర్వర్తించారు. 
రీవెంజ్ పాలిటిక్స్...

2005లో అప్పటి గుజరాత్ మంత్రి, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు విచారించారు. సోహ్రాబుద్దీన్‌పై 60 కేసులు పెండింగ్‌లో ఉండేవి. పోలీసు కస్టడీలో ఉన్న అతడు హత్యకు గురయ్యాడు. అప్పుడు గుజరాత్ హోం మంత్రిగా ఉన్న అమిత్ షా అనుమతితోనే సోహ్రాబుద్దీన్‌ను ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. సుప్రీం ఆదేశాలతో ఈ కేసును 2010 జనవరిలో సీబీఐకి బదిలీ చేశారు. ఆరు నెలల తర్వాత.. అంటే జూలై 2010లో సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ అమిత్ షాను అరెస్ట్ చేసింది. అప్పట్లో చిదంబరం కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోరినట్టుగానే.. అప్పట్లో అమిత్ షాకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ గుజరాత్ హైకోర్టును కోరింది. రాజకీయ బలంతో అమిత్ షా సాక్షులను భయపెట్టి ఆధారాలు లేకుండా చేసే ప్రమాదం ఉందని సీబీఐ ఆందోళన వ్యక్తం చేసింది. మూడు నెలల తర్వాత 2010 అక్టోబర్ 29న అమిత్ షా‌కి గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరుసటి రోజే కోర్టు వారంతాపు సెలవు రాగా.. సీబీఐ జస్టిస్ అఫ్తాబ్ ఆలమ్‌ను ఆశ్రయించింది. అమిత్ షా 2010 నుంచి 2012 వరకు గుజరాత్‌లో అడుగు పెట్టకుండా బహిష్కరిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. హోం మంత్రి చిదంబరం, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని, రాజకీయ ప్రత్యర్థులపై దాడుల కోసం సీబీఐని దుర్వినియోగం చేస్తోందని అప్పట్లో అమిత్ షా ఆరోపించారు. 2014లో కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది డిసెంబర్లో అమిత్ షాకు కేసుల నుంచి ఉపశమనం లభించింది. అమిత్ షా నిర్దోషి అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను హింసించిందని బీజేపీ ఆరోపించింది. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇవే తరహా ఆరోపణలను కాంగ్రెస్, చిదంబరం చేస్తున్నారు.