కశ్మీర్ లో ఇన్ కమింగ్ కాల్స్ కు అనుమతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కశ్మీర్ లో ఇన్ కమింగ్ కాల్స్ కు అనుమతి

శ్రీనగర్, ఆగస్టు 19 (way2newstv.com)
రెండు రోజుల కిందట కశ్మీర్‌లో ఆంక్షలను పాక్షికంగా సడలించినా శ్రీనగర్ లాంటి కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో మరోసారి మొబైల్ సేవలపై నిషేధం తాత్కాలికంగా కొనసాగనుంది. కొన్ని చోట్ల రాళ్లదాడులకు పాల్పడటంతో ల్యాండ్‌లైన్‌ పునరుద్దరణ వల్ల కలిగే ప్రభావాన్ని స్థానిక అధికారులు అంచనా వేసిన తరువాతే మొబైల్ సేవలను పునరుద్ధరించాలని భావిస్తున్నారు. మొబైల్ ఫోన్లకు ఇన్‌కమింగ్ కాల్ సదుపాయం మాత్రమే కల్పించినట్టు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. అయితే, అంతర్జాతీయ కాల్స్, మొబైల్ ఇంటర్నెట్ సేవలపై మాత్రం మరికొంత కాలం నిషేధం కొనసాగుతుంది. కాగా, కశ్మీర్ లోయలో ప్రాథమిక, మాధ్యమిక విద్యా సంస్థలు సోమవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. హయ్యర్ సెకెండరీ, డిగ్రీ కాలేజీలు మరో రెండు మూడు రోజుల్లో తెరుచుకోనున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 
కశ్మీర్ లో ఇన్ కమింగ్ కాల్స్ కు అనుమతి

ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో కశ్మీరీల హక్కులు భంగం కలుగుతుందని, వ్యాపారాలు, భూములు కోల్పోతారని తప్పుడు ప్రచారం జరగడంతో జమ్మూలోని అన్ని జిల్లాల్లో ఆదివారం నుంచే మొబైల్ ఇంటర్నెట్‌ను నిలిపివేసినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. వాస్తవానికి జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం వల్ల లక్షలాది మంది ప్రభుత ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, హిమాలయాలను ఇతర రాష్ట్రాలను ఆక్రమించుకుంటారనడంలో అర్ధంలేదని.. జమ్మూ కశ్మీర్ యువతకు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగవకాశాలు దక్కుతాయని అన్నారు. జమ్మూ కశ్మీర్ వ్యాపారవేత్తలు భవిష్యత్తు తరాల ప్రయోజనాలు కోసం ఆలోచించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. మరోవైపు, కశ్మీర్ లోయలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని, విడుదలైన తర్వాత ప్రభుత్వానికి సహకరించాలని నిర్బంధంలో ఉన్న నేతలను ప్రభుత్వ ప్రతినిధులు కలిసి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయరాదని వారిని కోరినట్టు అధికారులు తెలిపారు. శ్రీనగర్‌లో ఆదివారం స్వల్ప ఘటనలు మినహా కశ్మీర్‌లో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలియజేశారు