టీడీపీలో నాయకులు కావలెను - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీడీపీలో నాయకులు కావలెను

గుంటూరు,  ఆగస్టు 1, (way2newstv.com)
రాష్ట్రంలో ఓట‌మి బాధ‌తో ఉన్న టీడీపీకి ఇప్పటికే నాయ‌కుల కొరత వెంటాడుతోంది. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు పెద్దపీట వేయాల‌ని, అన్ని రంగాల్లోనూ వారికి ప్రాధాన్యం పెంచాల‌ని భావించిన చంద్రబాబు త‌న పార్టీలో మ‌హిళ‌ల‌కు ఎక్కువ‌గా సీట్టు కేటాయించారు. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేవలం రాజ‌మండ్రి సిటీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి దివంగ‌త ఎర్రంనాయుడు కుమార్తె ఆదిరెడ్డి భ‌వానీ మిన‌హా అంద‌రూ ఓడిపోయారు. నిజానికి రాజ‌కీయాల్లో గెలుపు, ఓట‌ములు స‌హ‌జమే. అయితే, ఇలా ఓడిపోయిన వారంతా ఏం చేస్తున్నారు ? చ‌ంద్రబాబు త‌మ‌కు ఇచ్చిన గౌర‌వాన్ని నిలుపుకొంటున్నారా ? అంటే ప్రశ్నలే మిగులుతున్నాయి.టీడీపీ నుంచి పోటీ చేసి.. ఓడిపోయిన చాలా మంది మ‌హిళా నేత‌లు ఇప్పుడు అధినేత చంద్రబాబుకు ట‌చ్‌లో కూడా లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం. 
టీడీపీలో నాయకులు కావలెను

వీరిలో సుదీర్ఘ కాలం పాటు పార్టీలో ఉండి ప‌ద‌వులు అనుభ‌వించిన వారు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్రధానంగా అనంత‌పురం జిల్లాకు చెందిన ప‌రిటాల సునీత‌, క‌ర్నూలుకు చెందిన భూమా అఖిల ప్రియ‌, ఇదే జిల్లాకు చెందిన, ఎన్నిక‌ల‌కుముందు టీడీపీలోకి వ‌చ్చి టికెట్ సొంతం చేసుకున్న గౌరు చ‌రితా రెడ్డి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిన వంగ‌ల‌పూడి అనిత‌, ఇదే జిల్లాలోని చింత‌ల‌పూడి నుంచి పోటీ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి, మంత్రి ప‌ద‌విని కూడా ద‌క్కించుకున్న పీత‌ల సుజాత వంటి వారు ఇప్పుడు చంద్రబాబుకు ట‌చ్‌లో కూడా రావ‌డం లేదు.అదేవిధంగా గంగాధ‌ర నెల్లూరు కు చెందిన కుతూహ‌ల‌మ్మ, శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నుంచి పోటీ చేసి ఓడిన గౌతు శిరీష, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన అదితి గ‌జ‌ప‌తిరాజు వంటి వారుకూడా చంద్రబాబుకు, పార్టీకి దూరంగా ఉన్నారు. వీరిలో ముగ్గురు నుంచి న‌లుగురు పూర్తిగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణయించుకోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో టీడీపీకి ఇప్పుడు కీల‌క‌మైన మహిళా సైన్యం పూర్తిగా దూర‌మ‌వుతోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక‌రిద్దరు ఉన్నప్పటికీ.. వారికి బ‌ల‌మైన వాయిస్ లేక పోవ‌డంతో ఫ్యూచ‌ర్ ప్రశ్నార్థకంగా మారింది.ఇలాంటి వారిలో కావ‌లి ప్రతిభా భార‌తి పూర్తిగా రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. ఇదే బాట‌లో కుతూహ‌ల‌మ్మ, ప‌రిటాల సునీత‌, సుజాత వంటివారు ఉండ‌డం ఇప్పుడు చంద్రబాబును క‌ల‌వ‌ర‌పెడుతున్న ప్రధాన అంశం. మ‌రో వైసీపీలో మాధ‌వి, అనూరాధ‌, గీత లాంటి మ‌హిళా ఎంపీల‌తో పాటు ఏకంగా 20 మందికి పైగా మ‌హిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరిలో యువ మ‌హిళ‌లే ఎక్కువ‌. ఇటు టీడీపీకి ఇలాంటి యువ మ‌హిళా నేత‌ల కొర‌త తీవ్రంగా ఉంది. మ‌రి రాబోయే రోజుల్లో చంద్రబాబు మ‌హిళా సైన్యాన్ని ఎలా త‌యారు చేసుకుంటారో చూడాలి.