విద్య శాఖలో ‘అనంత‘ లీలలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విద్య శాఖలో ‘అనంత‘ లీలలు

అనంతపురం, ఆగస్టు 21, (way2newstv.com)
అనంతపురం జిల్లాలో టీచర్ల సర్దుబాటుకు విద్యాశాఖ పూనుకుంది. ఈ ప్రక్రియ జూన్‌ 30లోగా పూర్తి చేయాలని విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అధికారులు నేటికీ ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు. ‘అయిన వారికి ఆకులో కానివారికి కంచంలో’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.సబ్జెక్టు టీచర్లు లేని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు, ముఖ్యంగా పదోతరగతి విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘సర్దుబాటు’కు పూనుకుంది. అయితే విద్యాశాఖ అధికారులు పైరవీలకు పెద్దపీట వేస్తూ సర్దుబాటుకు కొత్తభాష్యం చెబుతున్నారు.  విద్యార్థుల అవసరాలు కాకుండా టీచర్ల సౌలభ్యం కోసం సర్దుబాటు చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది.
విద్య శాఖలో ‘అనంత‘ లీలలు

చాలామంది ఉపాధ్యాయులు విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించడం లేదు. తాము నివాసాలు ఉంటున్న చోటుకు ఎంత దగ్గరికి వద్దామనే ఆలోచన తప్ప గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థుల భవిత్యం గురించి ఆలోచించడం లేదు. ఇలాంటి వారికి విద్యాశాఖ సిబ్బంది సపోర్ట్‌ చేస్తుండడం బాధాకరం. ఎంతసేపూ జిల్లా కేంద్రం, పట్టణాలు, మండల కేంద్రాలకు సమీపం, బస్సుల సదుపాయం అనుకూలంగా ఉన్నాయా...లేదా అనే టీచర్లు ఆలోచిస్తున్నారు. కొన్ని స్కూళ్లకు అవసరం లేకపోయినా కేవలం వారికి అనుకూలంగా ఉంటుందనే కారణంతో డీఈఓపై రాజకీయ నాయకులతో ఒత్తిళ్లు చేయించి మరీ ఆ స్కూళ్లలో చేరారు. దీనిని విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిగా తప్పుపడుతున్నారు.  రొళ్ల మండలం రత్నగిరి జెడ్పీహెచ్‌ఎస్‌లో 6–10 తరగతుల విద్యార్థులు 300 మంది ఉన్నారు. తెలుగు పండిట్‌ టీచర్లు ఇద్దరు పని చేస్తున్నారు. వీరిలో ఒకరిని ధర్మవరం మండలం గొట్లూరు జెడ్పీహెచ్‌ఎస్‌కు సర్దుబాటు చేశారు. గొట్లూరు స్కూల్‌లో 200 మంది విద్యార్థులున్నారు. ఇక్కడే ఇదివరకే ఒక టీచరు కూడా పని చేస్తున్నారు. అయినా మరో టీచరును సర్దుబాటు చేశారు. గుడిబండ మండలం కుమ్మరనాగేపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఫిజికల్‌ సైన్స్‌ టీచరును ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు జెడ్పీహెచ్‌ఎస్‌కు సర్దుబాటు చేశారు. నిబంధనల ప్రకారం మండల పరిధిలో సరఫ్లస్‌ (మిగులు) టీచర్లకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడ లేకపోతే పొరుగు మండలాలు, అక్కడా లేకపోతే పొరుగు డివిజన్‌ నుంచి తీసుకోవచ్చు. అయితే ముదిగుబ్బ మండలంలో ఓ యూపీ స్కూల్‌లో పీఎస్‌ టీచరు సరఫ్లస్‌గా ఉన్నారు. ఆ టీచరును కాదని ఎక్కడో గుడిబండ మండలం నుంచి తీసుకురావడం విశేషం. టీచర్ల సర్దుబాటులో జరుగుతున్న పైరవీలకు ఈ ఉదంతాలు నిదర్శనం.  విద్యార్థులు : ఉపాధ్యాయుల రేషియో మేరకు ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులను తక్కువ టీచర్లు ఉండి ఎక్కువ విద్యార్థులుండే  పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న చోటే జీతాలు తీసుకుంటూ మరోచోట పని చేయాల్సి ఉంటుంది. సర్దుబాటు ఆయా మండలాల పరిధిలోనే మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలి. ఈ నిబంధనలు ఏవీ పట్టించుకోలేదు. విద్యార్థుల కోసం కాకుండా ఉపాధ్యాయుల సౌలభ్యం కోసమే చాలామందిని డెప్యూటేషన్‌పై నియమించారు. అయితే చాలామంది టీచర్లు పైరవీలు చేశారు. అవసరమైన చోటుకు కాకుండా...వారికి అనుకూలమైన ప్రాంతాలకు సర్దుబాటు చేయించుకున్నారు. విద్యాశాఖ సిబ్బంది అడ్డుగోలుగా సర్దుబాటు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు ఒత్తిళ చేయించి కొందరు టీచర్లు తమకు అనుకూలమైన చోటుకు వెళ్లగా, ఇదే అదనుగా  కొందరు డీఈఓ కార్యాలయ సిబ్బంది ఆమ్యామ్యాలకు తెర తీశారు. అనుకూలమైన వారితో డబ్బు ఒప్పందం చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా రిలీవ్‌ ఉత్తర్వులు పంపుతున్నారు.  ప్రతి చిన్న విషయాన్ని డీఈఓ బ్లాగులో పెట్టే విద్యాశాఖ అధికారులు ఇంత భారీ ఎత్తున జరుగుతున్న సర్దుబాటు వివరాలను మాత్రం బ్లాగులో పెట్టకపోవడం విశేషం. ఈ వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు నోరు మెదపకపోవడం విశేషం.