హైద్రాబాద్, సెప్టెంబర్ 16, (way2newstv.com)
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. శాసనసభ, మండలిలో అధికార, విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా స్టార్టప్లకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుమన్, వివేక్ పలు ప్రశ్నలు అడిగారు. వీటికి తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన ఐటీ హబ్ విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 55 వేల స్టార్టప్లు ఏర్పాటు అయ్యాయని కేటీఆర్ తెలిపారు.ప్రస్తుతం రాయదుర్గం ప్రాంతంలో రూ.276 కోట్ల వ్యయంతో మూడు ఎకరాల్లో టీ హబ్-2ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
త్వరలో 55 వేల స్టార్టప్ లు
ప్రస్తుత టీ హాబ్ దేశంలోనే విజయవంతమైన ఇంక్యుబేటర్ కాగా, టీ హబ్ 2 ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్గా నిలవబోతుందని తెలిపారు. టీ హాబ్ -2తో నాలుగు వేలకు పైచిలుకు మంది యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలోని మరిన్ని పట్టణాలకు టీ హబ్ను విస్తరించనున్నట్లు వివరించారు. త్వరలో వరంగల్ పట్టణంలో కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు.ఐటీ పరిశ్రమను రాష్ట్రంలోని ఇతర నగరాలకు విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్లో రూ. 33 కోట్లతో ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. స్టార్టప్లలో గ్రామీణ యువతను కూడా భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ వివరించారు. తెలంగాణ నుంచి గోవా, ఢిల్లీ, అసోం రాష్ట్రాలకు కూడా టెక్నాలజీ సహకారం అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ..
తెలంగాణలో అతి త్వరలో ఫుడ్ ఇన్స్పెక్టర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యను కూడా పెంచుతామన్నారు. ప్రస్తుతం ఒక్కో ఫుడ్ ఇన్స్పెక్టర్ నెలకు 150 శాంపిల్లను సేకరించి పరిశీలిస్తున్నారని తెలిపారు. ఆహార నాణ్యత విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ చట్టంలో మార్పులు తీసుకు వస్తామని మంత్రి కేటీఆర్ వివరించారు.
Tags:
telangananews