ఉపాధి హామీ పధకంలో అక్రమాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉపాధి హామీ పధకంలో అక్రమాలు

కర్నూలు, సెప్టెంబర్ 12, (way2newstv.com)
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రాజకీయం చోటు చేసుకుంటోంది. కొంత మందిని టార్గెట్‌ చేసి మరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగిస్తున్నారు. జిల్లాలో 889 గ్రామ పంచాయతీలు ఉండగా..  ఉపాధి హామీ పథకం కింద   ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సీనియర్,  జూనియర్‌ మేటీలు గ్రామానికి ఒకరు చొప్పున పనిచేస్తున్నారు.  ఏడాదిలో 7,500 పనిదినాలు కల్పించలేదన్న నెపంతో ఇటీవల సుమారు వంద మందినితొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కోవెలకుంట్ల మండలంలోని వెలగటూరు, బిజనవేముల, పెద్దకొప్పెర్ల గ్రామాల్లో సీనియర్‌ మేటీలుగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. నిబంధనల ప్రకారం వీరిపై వేటు పడింది. 
ఉపాధి హామీ పధకంలో అక్రమాలు

అయితే.. వీరిని జూనియర్‌ మేటీలుగా పరిగణించేందుకు తిరిగి పథకంలో కొనసాగిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి ఈ ఏడాది జూన్‌ ఆఖరు వరకు గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ మేటీలకు 7,500 పనిదినాల చొప్పున, జూనియర్‌ మేటీలకు 5వేల పనిదినాల చొప్పున కేటాయించారు. పదిదినాలతో పాటు కూలీలకు రోజుకు రూ.205 వేతనం పడాలన్న నిబంధన విధించారు. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేరుకోలేని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ మేటీలపై వేటు పడగా.. మరి కొన్ని గ్రామాల్లో ఫీల్ట్‌ అసిస్టెంట్లు లక్ష్యాన్ని అధిగమించినప్పటికీ ఇతర కారణాలు చూపి తొలగించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లోఅనుకూలంగా లేని వారిని అధికారులు బలిపశువులు చేసినట్లు  ఆరోపణలున్నాయి. కోవెలకుంట్ల మండలంలోని పెద్దకొప్పెర్ల, వెలగటూరు, బిజనవేముల, సంజామ ల మండలం ఎగ్గోని, కొలిమిగుండ్ల మండలం నందిపాడు, బందార్లపల్లె, బెలూం గ్రామాల్లోని సీనియర్‌ మేటీలు 7,500 పనిదినాల కంటే తక్కువ కల్పించడంతో వారిని తొలగించారు. అయితే.. వీరి స్థానాల్లో ఇతరులను నియమించకుండా తిరిగి వారినే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నాయకులకు అనుకూలంగా లేని సిబ్బందికి మాత్రం ఇలాంటి అవకాశం ఇవ్వడం లేదు.