గోదావరి, ప్రకాశం జిల్లాల నీటి కోసం మరో ఎత్తిపోతల - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గోదావరి, ప్రకాశం జిల్లాల నీటి కోసం మరో ఎత్తిపోతల

విజయవాడ, అక్టోబరు 29 (way2newstv.com)
గోదావరి-కృష్ణానది అనుసంధానం కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం, సీఎం జగన్ కీలక ప్రతిపాదనపై దృష్టిపెట్టారు. పోలవరం దగ్గర ఉన్న గోదావరి జలాలను.. గుంటూరు జిల్లా బొల్లాపల్లి దగ్గర బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు తరలించేందుకు డీపీఆర్‌ తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జలవనరులశాఖ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అధికారులతో చర్చించారు. సాగునీటి వసతి ఉన్న ప్రాంతాలను స్థిరీకరించడంతో పాటూ కరువుతో, తాగునీటి కొరతతో కష్టాల్లో ఉన్న ప్రాంతాలకు జలాలను తరలించి వారి కష్టాలను తీర్చాలన్నదే ప్రయత్నం అన్నారు. డీపీఆర్‌ తయారుచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
గోదావరి, ప్రకాశం జిల్లాల నీటి కోసం మరో ఎత్తిపోతల

గోదావరి ద్వారా సముద్రంలో వృథాగా పోతున్న నీటిలో రోజుకు 2 టీఎంసీల నీటిని.. మొత్తంగా 210 టీఎంసీలను వరద జలాలను తరలించాలన్న లక్ష్యంతో ఉంది ప్రభుత్వం. ఇలా నాగార్జున సాగర్‌ కుడికాల్వ ఆయకట్టులోని 9.61 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని.. నాగార్జున సాగర్‌ రెండో దశలో భాగంగా ప్రకాశం జిల్లాలోని దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో మరో 2 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాలని భావిస్తున్నారు. ఇటు గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను ఈప్రాజెక్టు ద్వారా తీర్చాలన్నది ఆలోచనలో ఉన్నారు.ఇటు పులిచింతల, అటు నాగార్జున మీద ఆధారపడ్డ ప్రాంతాలకు బొల్లాపల్లి బాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోన నీరు ప్రాణాధారంలా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. గత 15 ఏళ్లుగా గోదావరి నదిలో నీటి ప్రవాహాన్ని ప్రామాణికంగా తీసుకుని 105 రోజుల్లో రోజుకు 3.7 టీఎంసీల ప్రవాహం ఉంటుందని వాప్‌కోస్‌ అంచనా వేసింది. ఇలా వచ్చే నీటిలో గోదావరి డెల్టా అవసరాలపోను.. మిగిలిన నీరు సముద్రంలోకి పోతోందని.. ఇలా సముద్రంలో కలిసిపోతున్న జలాలను కరువు, నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించడం ద్వారా మంచి చేయొచ్చని భావిస్తోంది. అలాగే రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వెలిగొండతో, కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్ట్, ఎస్సార్‌బీసీ అవసరాల కోసం బనకచర్ల రెగ్యులేటర్‌ ద్వారా నీరందించే అవకాశం ఉంటుంది.ప్రభుత్వం చెబుతున్న ప్లాన్ ప్రకారం.. పోలవరం కుడికాల్వ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి.. అక్కడ నుంచి నాగార్జునసాగర్‌ కుడికాల్వకు ఎత్తి పోస్తారు. అక్కడనుంచి బొల్లాపల్లిలో ప్రతిపాదిత బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు నీటిని లిఫ్ట్‌ చేస్తారు. బొల్లాపల్లి నుంచి వెలిగొండ రిజర్వాయర్‌కు నీటిని అందిస్తూ.. మరోవైపు నల్లమల అడవుల్లో ఒక టన్నెల్‌ను తవ్వడం ద్వారా బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌కు తరలిస్తారు.ఈ మొత్తం ప్రక్రియలో 460 కిలోమీటర్ల మేర నీటిని గ్రావిటీ ద్వారా.. మరికొన్నిచోట్ల ఎత్తిపోతల ద్వారా తరలిస్తారు. సముద్రమట్టానికి 37 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు ఉంటే.. 260 మీటర్ల ఎత్తులో బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌ ఉంది. అంటే 230 మీటర్ల ఎత్తుకు వివిధ దశల్లో నీటిని ఎత్తి పోస్తారు. మొత్తంగా దీనికోసం 2100 మెగావాట్ల కరెంటు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రతిపాదిత ప్రాజెక్టు విలువ రూ.60వేల కోట్లపైనే ఉంటుందని అంచనా. గత టీడీపీ ప్రభుత్వం కూడా గోదావరి-కృష్ణా అనుసంధానం చేసింది. పట్టిసీమ పేరుతో లిఫ్ట్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.