టీడీపీతో జనసేన రహస్య ఒప్పందంపై చర్చలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీడీపీతో జనసేన రహస్య ఒప్పందంపై చర్చలు

బాబు కామెంట్స్ తో అనుమానాలు
విశాఖపట్టణం, అక్టోబరు 18, (way2newstv.com)
ఏ పార్టీ అధినేత అయినా తమ పార్టీ అభ్యర్ధులు గెలవాలని కోరుకుంటారు ఒక్క చంద్రబాబు తప్ప. విశాఖ జిల్లా అంతటా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి గాజువాకలో అడుగుపెట్టనపుడే చంద్రబాబు వైఖరి ఏంటో అక్కడ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి తెలిసిపోయింది. స్వయంగా ఆయన వెళ్ళి మరీ చంద్రబాబుని బతిమాలుకున్నారు. ఒక్కసారి గాజువాక వచ్చి ప్రచారం చేయమని అడిగారు కూడా. అయినా కూడా చంద్రబాబు మాత్రం ససేమిరా అనేశారు. అదే కొంపముంచి చివరకు పల్లా ఓడిపోయారు. ఒకవేళ చంద్రబాబు ఏ కారణం చేతనైనా గాజువాక రాలేదేమోనని ఇంతకాలం ఒకశాతం అయినా వేరే విధంగా అలోచించే పల్లా లాంటి నాయకులకు, వారి అనుచరులకు అధినేత చంద్రబాబే కళ్ళుతెరిపించేశారు. తాను గాజువాక రాకపోవడానికి కారణం సొంత పార్టీ అభ్యర్ధిని ఓడించాలను కోవడమేనని కూడా చెప్పకనే చెప్పేశారు.
టీడీపీతో జనసేన రహస్య ఒప్పందంపై చర్చలు

గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్ సమీక్షా సమావేశంలో అక్కడ ఎందుకు ప్రచారం చేయలేదు అని తమ్ముళ్ళు చంద్రబాబుని అడిగినపుడు జనసేన అధినేత పోటీ చేస్తున్నాడు కాబట్టి హుందాగా ఉండదని భావించి ప్రచారం చేయలేదని చెప్పుకున్నారు. అంతటితో కాకుండా అక్కడ నుంచి పవన్ ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుండేదని కూడా తన మనసులో మాటను చంద్రబాబు బయటపెట్టేసుకున్నారట. పవన్ గెలిచి అసెంబ్లీలో ఉంటే ఆ సీనే వేరుగా ఉండేదని చంద్రబాబు అన్నట్లుగా భోగట్టా. అంటే సొంత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఓడిపోయినా ఫరవాలేదు, పవన్ మాత్రం గెలవాలట. మరి ఈ మాట విన్న గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు మరోసారి తాను ఓడిపోయానని అనిపిస్తే మాత్రం ఆ తప్పు చంద్రబాబుదే. చంద్రబాబు మార్క్ రాజకీయానికి తాను ఇలా బలి అయిపోయానని బాహాటంగా తెలుసుకున్న పల్లాకు ఇపుడు ఏమనిపిస్తుందో కానీ పార్టీ అంటే అంకితభావం చూపించిన క్యాడర్ కి మాత్రం ఓడిపోవాలని కూడా పార్టీ అభ్యర్ధులను పెడుతుందా అన్న డౌట్లు పుట్టుకువస్తున్నాయట.సార్వత్రిక ఎన్నికల్లో లోపాయికారిగా టీడీపీ, జనసేనల మధ్య ఒప్పందం ఉందని అప్పట్లో వైసీపీ కోడై కూసింది. దానికి తగిన ఆధారాలు కూడా ఎప్పటికపుడు బయటపెడుతూ వచ్చింది. దాన్ని జనం కూడా నమ్మి రెండు పార్టీలకు దారుణమైన ఫలితాలను ఇచ్చారు. అయితే ఓటమి తరువాత జనసేన తమకు ఎవరితోనూ పొత్తులు, లాలూచీలు లేవని చెప్పుకుంది. కానీ గడచిన నాలుగునెలలుగా జనసేన మాటలు, విమర్శలు అన్నీ కూడా టీడీపీకి డిటోగానే సాగుతున్నాయి. ఇక అమరావతి రాజధాని తరలింపు పుకార్ల ఎపిసోడ్ లో పవన్ అక్కడ స్వయంగా పర్యటించడంతో ఎన్నికల అనంతరం కూడా బంధం అలాగే ఉందని ప్రచారమూ జరిగింది. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ తో ఒకరకమైన అవగాహన ఉందన్న దాన్ని వూహాగానంగా కాకుండా రేఖామాత్రంగానైనా అధారాలతో టీడీపీ సమీక్షల్లో చంద్రబాబు బయటపెట్టడంతో జనం తెలివైనవాళ్ళేనని అనిపించకమానదు, ఇప్పటి జనానికి లోపాయికారీలు, లాలూచీలు నేత‌లకంటే కూడా బాగా తెలిసిపోతున్నాయనడానికి తాజా ఎన్నికలు, వాటి ఫలితాలు అతి పెద్ద ఉదాహరణగా చెప్పుకోవాలేమో