సొంత పార్టీ నేతలే జూపల్లి కి ఝలక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సొంత పార్టీ నేతలే జూపల్లి కి ఝలక్

మహబూబ్ నగర్, అక్టోబరు 3 (way2newstv.com)
రాజ‌కీయాల్లో అధికారంలో ఉండ‌గా.. ఉండే ద‌ర్పం.. అధికారం కోల్పోయినా.. ప్ర‌జ‌ల్లో ఓట‌మి పాలైనా ఉండద‌నేని వాస్త‌వం. అయితే, క‌నీసం సొంత పార్టీలో అయినా గౌర‌వం ఉంటుందిగా.. అనే వ్యాఖ్య మ‌న‌కు తెలిసిందే. అయితే, కొంద‌రు చేసుకునే చ‌ర్య‌ల కార‌ణంగా.. అది కూడా కోల్పోయే ప‌రిస్థితి ఉంటుంది. ఇలాంటి వారిలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు.. తెలంగాణ‌కు చెందిన మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. అధికార టీఆర్ఎస్‌లో ఒక‌ప్పు డు చ‌క్రం తిప్పిన జూప‌ల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా , మంత్రిగా త‌న ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కొంద‌రికి ద‌గ్గ‌ర‌య్యే క్ర‌మంలో చాలా మందికి దూర‌మ‌య్యారు. ఈ ప‌రిణామమే జూప‌ల్లి కృష్ణారావుకు రాజ‌కీయంగా భ‌విత‌వ్యం లేకుండా చేసేసింది.మాజీ కాంగ్రెస్ నేత అయిన జూప‌ల్లి కృష్ణారావు.. టీఆర్ఎస్‌లో చేరి.. 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. 
సొంత పార్టీ నేతలే జూపల్లి కి ఝలక్

జూప‌ల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో మంత్రిగా ఉండి ప్ర‌త్యేక తెలంగాణ కోసం త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి, ఎమ్మెల్యే ప‌ద‌వి వ‌దులుకుని మ‌రీ టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎదురులేని నాయకుడిగా హవా చాటిన లీడర్. సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి జిల్లాలో అన్నీ తానై వ్యవహరించారు జూప‌ల్లి కృష్ణారావు. ఈ క్రమంలోనే ఆయన అప్పట్లో సొంతపార్టీలోనే కొంతమంది సహచర నాయకులతో వివాదాలను కొని తెచ్చుకున్నారు. మంత్రి హోదాలో ఉన్న తనకు తిరుగులేదని భావించిన జూప‌ల్లి కృష్ణారావుకి, 2018 డిసెంబ‌రులో జరిగిన ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు అనూహ్యమైన తీర్పునిచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కారు గుర్తు అభ్యర్థులు 13 చోట్ల ఘ‌న‌విజ‌యం సాధించారు.అయితే, ఒక్క జూప‌ల్లి కృష్ణారావు మాత్రమే ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిని అప్పట్లో మామూలు విషయంగానే జూప‌ల్లి కృష్ణారావు ప‌రిగ‌ణించారు. అయితే ఇది త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు డేంజ‌ర్ అన్న విష‌యం ఆయ‌న గుర్తించ లేక‌పోయారు. అయితే, రానురాను ఆయ‌న పార్టీలోనూ నేత‌ల మ‌ధ్య కూడా చాలా వ‌ర‌కు ఒంట‌రి అయిపోయారు. ప్రధానంగా జూప‌ల్లి కృష్ణారావు మీద గెలిచి టీఆర్ఎస్ లో చేరిన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి ఒకరైతే మరొకరు మంత్రి నిరంజన్ రెడ్డిలు. ఈ ఇద్దరూ కలిసి కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లికి చుక్కలు చూపిస్తున్నారట. కాంగ్రెస్ నుంచి జూప‌ల్లి మీద గెలిచిన హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌రెడ్డి ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌లోకి జంప్ చేసేశారు. ఇక అక్క‌డ నుంచి రాజ‌కీయం మారిపోయింది. జూప‌ల్లి సీన్ రివ‌ర్స్ అయ్యింది.ప్రస్తుత మంత్రి నిరంజన్ రెడ్డి జూప‌ల్లి కృష్ణారావుపై తీవ్ర కసితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో జూపల్లి మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ది పథకాలను, శంఖుస్థాపనలకే పరిమితం చేసినట్టు సమాచారం. మ‌రోప‌క్క ఉమ్మడి జిల్లాలో మంత్రిహోదాలో జూపల్లి కృష్ణారావు ప్రారంభించిన చాలా పనులు ఇలా పెండింగ్‌లోనే ఉన్నాయి. జూప‌ల్లి కృష్ణారావుని రాజకీయంగా ఇతర పార్టీల కంటే సొంత పార్టీ వాళ్లే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని నాగర్ కర్నూల్ జిల్లా లో వినిపిస్తోంది. ఇందుకు మరో కార‌ణం కూడా ఉంద‌ట‌. జూప‌ల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్న‌ప్పుడు వ‌న‌ప‌ర్తిలో నిరంజ‌న్ రెడ్డి ఓడిపోయారు. అప్పుడు మంత్రిగా ఉన్న జూప‌ల్లి కృష్ణారావు నిర‌జంన్‌రెడ్డిని ప‌క్క‌న పెట్టి రాజ‌కీయం చేయ‌డంతో పాటు ఆయ‌న్ను ఇబ్బంది పెట్టార‌ట‌. ఇలా మొత్తంగా ఆయ‌న అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న‌కు తిరుగులేద‌ని భావించారు. ఇక‌, ఎప్ప‌టికీ తానే అధికారంలో ఉంటాన‌ని అనుకున్నారు. కానీ, ఐదేళ్లు తిరిగే స‌రికి అస‌లు విష‌యం అర్ధ‌మై.. ఇప్పుడు నొచ్చుకుంటున్నారు. మ‌రి ఈ క్ర‌మంలో జూప‌ల్లి కృష్ణారావుని ప‌ట్టించుకునేదెవ‌రు? రాజ‌కీయంగా ప్రాధాన్యం ఇచ్చేదెవ‌రు? అంతా టైమే తేల్చాలి