స్టాంపుల రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్టాంపుల రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు

నిజామాబాద్, జనవరి 6, (way2newstv.com)
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కొత్త విధానం అమల్లోకి తీసుకురానుంది. ఐదు సంవత్సరాలుగా కాలంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. ఆప్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పూర్తి స్థాయిలో పనులు పారదర్శకంగా జరుగుతున్నాయని, ప్రభుత్వానికి రాబడి మరింతగా పెరిగిందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.ప్రజల ఆర్థిక, సామాజిక అవసరాలతో నేరుగా ముడిపడి ఉన్న ఈ శాఖలో ఫైరవీలకు ఆస్కారం లేకుండా సంస్కరణలు చేయడంతో ప్రస్తుతం దళారులు, ఫైరవీకారుల బెడద తప్పిందని ప్రజలు పేర్కొంటున్నారు. నగదురహిత లావాదేవీల్లో సమూల మార్పులు చేస్తూ ఆ శాఖను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ ద్వారా మరింత ఆదాయాన్ని పెంచుకునేలా సిఎం కెసిఆర్ భూముల విలువ పెంచాలని నిర్ణయించినట్టుగా అధికారిక వర్గాలు తెలిపాయి. 
స్టాంపుల రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు

భూమి హక్కుల కల్పన తరువాత ప్రధానంగా ఆదాయ మార్గాల అన్వేషణలో ఆ శాఖ దృష్టి సారించింది. దీంతో మార్కెట్ విలువను పునః సమీక్షించి సవరించాలని కెసిఆర్ నిర్ణయించడంతో ఇప్పటికే అన్ని జిల్లాలో ఉన్న మార్కెట్ విలువకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి ఆ శాఖ అధికారులు అందచేశారు. భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే వారి కోసం ఆన్‌లైన్ విధానం ద్వారా స్లాట్‌ను బుక్ చేసుకొని అనుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ జరిగేలా చూడడంతో ఉద్యోగులపై పనిభారాన్ని ఆ శాఖ తగ్గించగలిగింది. డాక్యుమెంట్ల స్కానింగ్‌లో ఆటోమేటెడ్ విధానంతో దళారులు, డాక్యుమెంట్ల రైటర్ల ప్రభావం లేకుండా మార్పులకు ఆ శాఖ ఉన్నతాధికారులు 2019లో శ్రీకారం చుట్టారు. సబ్ రిజిస్ట్రార్‌లు ఏ సమయంలో వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారో తెలుసుకోవడానికి ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో సమయానికి సబ్ రిజిస్ట్రార్‌లు ఆఫీసుకు వస్తున్నారని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.ఐదు సంవత్సరాల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోంది. ఆదాయం, రిజిస్ట్రేషన్లలోనూ పురోగతి సాధించడంతో ఇప్పటికే రెండింతలు ఆదాయం పెరిగిందని ఆ శాఖ గణాంకాలను బట్టి తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా సంవత్సరానికి సుమారు రూ.5 నుంచి రూ.6 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది. ఇందులో ఎక్కువగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, యాదాద్రి, హైదరాబాద్‌ల ద్వారే ఎక్కువగా ఆదాయం వస్తుందని, ఇక్కడ రియల్ భూమ్ ఉండడం కూడా ఆదాయం ఎక్కువగా రావడానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2019 వరకు చూసుకుంటే గణనీయమైన అభివృద్ధిని ఆ శాఖ సాధిస్తోంది.2014 సంవత్సరంలో 5,63,492 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, దీని ద్వారా రూ.1,933,79,26,509 కోట్ల ఆదాయం ఆ శాఖకు వచ్చింది. 2018 సంవత్సరం చూసుకుంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు 14,23,306 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా రూ.5,527,49,66,953 ద్వారా ఆదాయం, 2019,20 సంవత్సరానికి చూసుకుంటే ఇప్పటివరకు 12 లక్షల డాక్యుమెంట్లు కాగా రూ.5 వేల కోట్లకు పైగా రాబడి వచ్చినట్టుగా ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.రిజిస్ట్రేషన్ల శాఖ అవలంభిస్తున్న స్లాట్ విధానం వలన కళ్యాణలక్ష్మితో పాటు షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులను గుర్తించడంలో అధికారులకు ఇబ్బందులు తొలగాయి. దీంతోపాటు బాల్య వివాహాలను చెక్ పెట్టేలా అధికారులు రిజిస్ట్రేషన్ మ్యారేజ్‌ను తెరపైకి తీసుకురావడం ప్రభుత్వానికి కలిసి వచ్చి ంది. స్లాట్ విధానం కింద మ్యారేజ్ చేసుకుంటున్న వారిలో జిల్లాల వారీగా చూసుకుంటే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మొదటిస్థానంలో ఉండగా, హైదరాబాద్ జిల్లా రెండో స్థానం, రంగారెడ్డి మూడో స్థానంలో నిలిచాయి. బాల్య వివాహాలు చేసుకొని ఈ పథకం కింద లబ్ధిపొందాలనుకునే వారు ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. వినియోగదారుల సౌకర్యం కోసం ఇప్పటికే ఆన్‌లైన్ విధానం కింద స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక యాప్‌లను రూపొందించింది. ఇవి వినియోగదారులకు ఉపయోగపడేలా ఉండడంతో వీటికి మరింత ఆదరణ పెరిగింది.స్టాంపు డ్యూటీని చెల్లించని సంస్థలకు 2019లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు నోటీసులు పంపించారు. ఇదే విషయమై ఆర్‌బీఐకు లేఖ రాశారు. ఎగవేతదారుల్లో బ్యాంకు లు, ఫైనాన్స్ సంస్థలే అధికంగా ఉన్నట్టు ఆ శాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ విషయమై పలు సంస్థలతో అవగాహన సదస్సు నిర్వహించినా వారు స్పందించకపోవడంతో, రుణ ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీ ఎగవేతపై ఆ శాఖ కమిషనర్ చిరంజీవులు సీరియస్‌గా స్పందించి స్టాంప్‌డ్యూటీని ఎగవేసిన బ్యాంకులు, ఫైనాన్స్‌తో పాటు మిగతా సంస్థలకు నోటీసులు పంపించారు. దీంతోపాటు రిజిస్ట్రేషన్లకు పాన్, ఆధార్‌ను తప్పనిసరి చేశారు. రూ.50 వేలు దాటిన లావాదేవీలకు కచ్చితంగా పాన్‌కార్డును తీసుకోవాలని, ఆధార్‌కార్డును గుర్తింపుకార్డుగా పరిగణించాలని అన్ని జిల్లాల రిజిస్ట్రార్‌లకు ఆ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో పాటు దానిని కచ్చితంగా అమలు చేసేలా ఆ శాఖ చర్యలు చేపట్టింది.