జూనాఘడ్, ఆగస్ట్ 24(way2newstv.com)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూనాగఢ్ జిల్లా లో వివిధ పథకాలను గురువారం ప్రారంభించారు. ఈ పథకాలలో జూనాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లోని కొన్ని భవనాలు, ప్రభుత్వ ఆసుపత్రి, ఒక మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంటు వంటివి ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక జన సభ లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజున దేశ ప్రజలకు అంకితం కాబడుతున్న లేదా శంకుస్థాపన జరుపుకొంటున్న పథకాలలో తొమ్మిది పథకాలు ఉన్నాయని, వాటి విలువ 500 కోట్ల రూపాయలకు పైగానే అని వివరించారు. భారతదేశ పురోగమన యాత్ర లో ఒక నూతనోత్సాహం, చైతన్యశీలత తొణికిసలాడుతున్నాయని ఆయన అన్నారు. గుజరాత్ లో రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి తగినంత నీరు అందేటట్లు శ్రద్ధ తీసుకోవడం కోసం స్థిర ప్రాతిపదికన కృషి జరుగుతోందని ఆయన అన్నారు. మేము జల సంరక్షణ దిశగా కూడా పని చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.
జూనాగఢ్ జిల్లా లో వివిధ పథకాలను ప్రారంభించిన ప్రధాని
గుజరాత్ వ్యాప్తంగా వైద్య కళాశాలలు, ఇంకా ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ఇవి రోగులకు సహాయకారిగా ఉండడమే కాక వైద్య శాస్త్రాన్ని అభ్యసించగోరే వారికి కూడా తోడ్పతాయని ఆయన తెలిపారు. మందుల ధరలను తగ్గిస్తున్న జన్ ఔషధి స్టోర్ లు జన్ ఔషధి యోజన లో భాగంగా ప్రారంభమవుతున్న సంగతి ని గురించి ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. పేదలకు, మధ్యతరగతి వారికి తక్కువ ధరల లో మందులు లభ్యం కావడం ముఖ్యమని ఆయన చెప్పారు. పరిశుభ్రత కు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యం ప్రపంచం అంతటా ప్రశంసలకు నోచుకొంటోందని ప్రధాన మంత్రి అన్నారు. పరిశుభ్రమైన భారతదేశం లో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉంటారని, ఈ కారణంగానే పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం అని ఆయన వివరించారు. మంచి వైద్యుల తో పాటు పారామెడికల్ స్టాఫ్ కూడా ఆరోగ్య రంగానికి అవసరమని ప్రధాన మంత్రి అన్నారు. మేము వైద్య పరికరాలు సైతం భారతదేశం లో ఉత్పత్తి కావాలని అభిలషిస్తున్నాం, ప్రపంచం లో సాంకేతిక విజ్ఞాన పరంగా చోటు చేసుకొంటున్న పురోగామి పరిణామాలతో సరి సమాన స్థాయి వేగాన్ని ఈ రంగం అందుకోవాలని కూడా ఆయన అన్నారు. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్ ఆగమనం ఆరోగ్య రంగం రూపురేఖలను మార్చివేయగలుగుతుంది; అలాగే పేదలు తక్కువ ధరలకే ఉన్నత శ్రేణి ఆరోగ్య సంరక్షణ సేవలను అందుకొనేటట్లుగా ఈ పథకం శ్రద్ధ వహిస్తుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.