తిరుపతి (way2newstv.com)
రెండు రోజుల తిరుమల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం చెన్నై నుండి భారత వైమానికదళ ప్రత్యేక హెలికాప్టర్ లో తిరుపతి-రేణిగుంట ఎయిర్పోర్ట్ లో దిగిన శ్రీలంక ప్రధానమంత్రి శ్రీ రాణిల్ విక్రమసింఘే, శ్రీమతి మైత్రి విక్రమసింఘే దంపతులకు, వారి బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మైనింగ్ శాఖ మంత్రి సుజయ కృష్ణారంగారావు, జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ప్రోటోకాల్ అదనపు సెక్రెటరీ లెఫ్టినెంట్ కల్నల్ ఎం. అశోక్ బాబు, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, ఆర్డిఓ లు నరసింహులు, కోదండరామి రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పుల్లా తదితరులు పుష్ప గుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.
శ్రీలంక ప్రధాన మంత్రికి ఘన స్వాగతం
అనంతరం, ఎయిర్పోర్ట్ లోపల ఉన్న విఐపి లాంజ్ లో శ్రీలంక ప్రధానమంత్రి దంపతులు కాసేపు విశ్రాంతి తీసుకొని మంత్రి సుజయ కృష్ణారంగారావు, జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ప్రోటోకాల్ అదనపు సెక్రెటరీ లెఫ్టినెంట్ కల్నల్ ఎం. అశోక్ బాబు, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి లతో ఇష్టాగోష్టిగా కాసేపు మాట్లాడి అనంతరం తిరుమల బయలుదేరి వెళ్లారు. తిరుమలలో శ్రీకృష్ణ అతిధి గృహం వద్ద టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జెఈఓ శ్రీనివాస రాజు తదితరులు శ్రీలంక ప్రధాన మంత్రి దంపతులకు ఘన స్వాగతం పలికారు.
శ్రీలంక ప్రధానమంత్రి దంపతులు మరియు వారి బృందం తిరుమల శ్రీకృష్ణ అతిధి గృహంలో గురువారం రాత్రి బస చేసి శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకొని మధ్యాహ్నం తిరుమల నుండి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని భారత వైమానికదళ ప్రత్యేక హెలికాప్టర్ లో చెన్నై బయలుదేరి వెళతారు.