అడ్డు, అదుపు లేకుండా ఇసుక తవ్వుతున్నారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అడ్డు, అదుపు లేకుండా ఇసుక తవ్వుతున్నారు

గుంటూరు, ఫిబ్రవరి 12, (way2newstv.com)
ఉచిత ఇసుక ముసుగులో లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందిన కాడికి దోచుకొని లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. ‘పేదవాడికి ఉచిత ఇసుక అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇసుకపై అక్రమ దందా చేస్తే ఏ పార్టీకి చెందిన వారినైనా వదిలి పెట్టం. ఇసుక విధానం సక్రమంగా అమలు చేయడానికి డివిజన్, జిల్లా స్థాయిల్లో టాస్క్‌ఫోర్క్‌ అమలు చేస్తున్నప్రకటనలు మాటలకే పరిమితం తప్పా అమలు కావడం లేదు.గతంలో పొక్లెయిన్ల ద్వారా కృష్ణా నదిలో ఇసుకను తవ్వేవారు. ఇప్పుడు ఏకంగా డ్రెడ్జర్స్‌ ద్వారా 10 నుంచి 20 అడుగుల లోతులో గోతులు తీసి తోడేస్తున్నారు. వాటిల్లో సందర్శకులు, పడవలు బోల్తా పడి పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.



అడ్డు, అదుపు లేకుండా ఇసుక తవ్వుతున్నారు

 మూడు నెలల కిందట జరిగిన ఫెర్రీ ఘాట్‌ ప్రమాదంలో 24 మంది జల సమాధి అయ్యారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఇసుక తవ్వకాలను నియంత్రించడంలో జిల్లా మైన్స్, విజిలెన్స్, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టనట్టు ఉన్నారంటే మామూళ్ల మత్తులో ఉన్నారేమోనని ఆరోపణలు వెలువడుతున్నాయి. పర్యావరణం సైతం దెబ్బతిన్నా అక్రమార్కులు నిబంధనలు మాత్రం పట్టించుకోవడం లేదు. పగలు,రాత్రీ తేడా లేకుండా నదికి నిలువునా గుండె కోత పెడుతున్నారు. ఇష్టారీతిగా వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తూ టీడీపీ నేతలే ఈ దందాను కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది.ఇసుక రవాణా కోసం ప్రభుత్వం ర్యాంపు మంజూరు చేయకపోయినా అధికార పార్టీకి చెందిన నేతలు స్థానిక నియోజకవర్గ, జిల్లా నాయకుల అండతో ఉచిత ముసుగులో దందాను నిర్వహిస్తున్నారు. నది గర్భాన్ని ధ్వంసం చేసి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేస్తూ అక్రమార్జన ద్వారా  లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు.ఉచితం ముసుగులో నిత్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. రెవెన్యూ, మైన్స్, పోలీస్‌ అధికారులు అటువైపు చూడటమే లేదు. ఇదే అదునుగా కొందరు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పగలంతా రవాణా చేస్తూ రాత్రి సమయాల్లో లారీలకు ఎగుమతులు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర జిల్లాల్లో ఇసుకకు మంచి డిమాండ్‌ ఉన్నందున లారీ రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్మకాలు జరుపుతున్నారు. ఈ అక్రమ రవాణా గురించి రెవెన్యూ అధికారులకు తెలిసిన నేతల ఒత్తిడితో పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.తుళ్లూరు మండల పరిధిలో కరకట్టకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో 70 వరకు ట్రాక్టర్లు ఉన్నాయి. వీటికి తోడు 70 లారీలు రేవుల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తుంటాయి. ఒక్కో ట్రాక్టర్, లారీ 7 నుంచి 10 ట్రిప్పులు వేస్తాయి. ఇలా రోజుకు ట్రాక్టర్‌ ద్వారా సుమారు రూ.5 వేలు, లారీ ద్వారా రూ.10 వేల పైనే అక్రమంగా ఆదాయం సమకూరుతోంది. మొత్తంమీద రోజుకు రూ.10 లక్షల పైనే వ్యాపారం జరుగుతోంది.