హైదరాబాద్, ఫిబ్రవరి 13 (way2newstv.com):
ఆటవీ శాఖ అధికారులకు వ్యతిరేకంగా విశ్వ బ్రాహ్మణుల ఆందోళన నేపథ్యంలో ముఖ్య ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పీ.కే.ఝా ఒక ప్రకటన జారీ చేసారు. అటవీ శాఖ విశ్వ బ్రాహ్మణులను వేధిస్తోందనే ప్రచారం నిరాధారం, అవాస్తవ ప్రచారమని అయన అన్నారు. చట్ట ప్రకారం వ్యాపారం, పనులు చేసుకునే కార్పెంటర్లపై ఎలాంటి వేధింపులు, ఆంక్షలు లేవు. పైగా చట్టంలోని నిబంధనలను సడలించి విశ్వ బ్రాహ్మణులకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ఇచ్చిందని అయన అన్నారు.
ఆటవీ చట్టాలు ఉల్లంఘనులపై కఠిన చర్యలు
12 ఇంచుల వ్యాసం లోపు ఉన్న దూగోడ మిషన్లు వాడకంపై ఎలాంటి ఆంక్షలూ లేవు. ట్రాన్సిట్ పర్మీషన్, చెట్లు కొట్టడం, తరలించటం, వాడకం కోసం కేవలం 20 చెట్ల జాతులకు ఉన్నల మినహాయింపును ప్రభుత్వం పెంచి 44 జాతి చెట్లకు అనుమతిని ఇచ్చిందని అయన వివరించారు. మామిడి, వేప, తుమ్మ లాంటి సాధారణ చెట్లకు సంబంధించి కార్పెంటర్లపై ఎలాంటి ఆంక్షలూ లేవు. అడవి జాతికి చెంది, అమూల్యమైన టేకు, నల్లమద్ది ఇతర విలువైన చెట్లపై చట్ట ప్రకారం ఆంక్షలు ఉన్నాయి. పర్మిట్లతో ఈ జాతులకు చెందిన చెట్లు, కలప రవాణా వాడకానికి అనుమతి ఉంది. పర్మిట్లు లేకుండా అక్రమంగా విలువైన కలప రవాణా, కార్పెంటర్లు వస్తు తయారీకి వాడకం నిషేధం. చట్ట ప్రకారం తీవ్ర చర్యలు ఉంటాయి. వారి నుంచి కలపతో సహా మిషన్లను కూడా స్వాధీనం చేసుకుంటామని అయన హెచ్చరించారు. మొత్తంగా నిబంధనలకు లోబడి, చట్ట పరిధిలో పనిచేసే విశ్వ బ్రాహ్మణ, వడ్రంగివారు ఎలాంటి భయాలు లేకుండా పనిచేసుకోవచ్చు. చట్టాలను ఉల్లంఘించి అడవికి హాని చేసేవారిపై మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. అటవీ నేరాలపై కఠినంగా ఉండాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలను తూచ తప్పకుండా అటవీ శాఖ అమలు చేస్తుందని వెల్లడించారు.