ఇండియా వాంట్ రీవెంజ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇండియా వాంట్ రీవెంజ్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (way2newstv.com
జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన సైనికుల సంఖ్య 44కి చేరింది. భారీ సంఖ్యలో సైన్యాన్ని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి పట్ల సైన్యం రగిలిపోతోంది. ప్రతీకార చర్యకు తహతహలాడుతోంది. కేంద్రం కూడా ఉగ్రదాడి ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ప్రధాని మోదీ ఈ దాడిని ఖండించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పరిస్థితిని సమీక్షించారు. భద్రతా దళాలను జైషే మహ్మద్ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకోవడం పట్ల సామాన్యుడి రక్తం మరిగిపోతోంది. దెబ్బకు దెబ్బకొట్టాలని, వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండియా వాంట్స్ రివేంజ్ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఉగ్రదాడి పట్ల తీవ్రంగా స్పందించారు. సైనికుల ప్రతి రక్తం బొట్టుకి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన తెలిపారు.



 ఇండియా వాంట్ రీవెంజ్

 ఈ దాడి వెనుక ఉన్న వారిపై కఠినమైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా స్పష్టం చేశారు. వీరి మాటలను బట్టి మరోసారి ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడి చేసే అవకాశం ఉంది.జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొర పట్టణ సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై గురువారం సాయంత్రం జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో 44 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌ ప్రకటించింది. ఈ దాడితో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదుల దుశ్చర్యను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. కష్ట సమయంలో భారత్‌కు అండగా ఉంటామని ప్రకటిస్తున్నాయి. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని భారత్ చిరకాల మిత్రదేశమైన రష్యా తీవ్రంగా ఖండించింది. ఈ దాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ సందేశం పంపారు. ‘ జమ్మూకశ్మీర్‌లో భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ఈ క్రూరమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ దాడి చేసినవారు, చేయించినవారు కచ్చితంగా ఫలితం అనుభవిస్తారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే చర్యల్లో భారత్‌తో కలిసి మరింత ముందడుగు వేస్తామని మరోసారి చెబుతున్నా. ఈ కష్ట సమయంలో భారత్‌కు రష్యా అండగా ఉంటుంది. ఉగ్రదాడిలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అంటూ పుతిన్ సందేశం పంపారు.