తెలంగాణ ప్రభుత్వానికి తలవంపులు తెస్తున్న ఐఏఎస్ అధికారులను పక్కకు తప్పించి పాలనను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు భావిస్తున్నారు. పని చేయని అధికారులు, విధి నిర్వహణను తేలిగ్గా తీసుకుంటున్నవారు, అవినీతికి పాల్పడుతున్నవారు ఎంత పెద్ద స్థానంలో ఉన్నా వారిని అక్కడ నుంచి తప్పించాలనే కసరత్తును సి ఎం ప్రారంభించారు. టిఆర్ ఎస్ -1లో కొందరు అధికారులను మొహమాటాలకు పోయి కీలక పోస్టులు అప్పగించారు. మరి కొందరు సంబంధిత శాఖల మంత్రులను మచ్చిక చేసుకుని పాలనలో పెద్ద వాటా కొట్టేశారు. ఇప్పుడు అలాంటివి లేకుండా చేసుకోవాలని చంద్రశేఖరరావు భావిస్తున్నారు. టిఆర్ ఎస్ -1 నుంచి కీలక పోస్టుల్లో ఉన్నవారికి ఈ సారి స్థానభ్రంశం తప్పదని అంటున్నారు. ఈ దిశగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి చర్యలు ఉంటాయని తెలిసింది. సాంకేతిక విద్య, ఉన్నత విద్యామండలిలో కూడా మార్పులు?టిఆర్ ఎస్ -2కు అత్యంత చెడ్డపేరు తెచ్చిన సంఘటనగా ఇంటర్ రిజల్సు వ్యవహారాన్ని చెప్పవచ్చు.
పాలనలో ప్రక్షాళన..భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు?
26 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ రిజల్సు వ్యవహారం టిఆర్ ఎస్ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. దీనికి బాధ్యులైన అధికారులను తక్షణమే పక్కకు తప్పిస్తే విద్యా శాఖ మంత్రిని కూడా తప్పించాల్సి వస్తుందనే భావనతో వారిని కొనసాగనిచ్చారు. అదీ కాకుండా హైకోర్టులో కేసు ఉన్నందున అధికారులను పక్కకు తప్పిస్తే కోర్టు కేసును డీల్ చేయడం కొత్త అధికారికి సాధ్యం కాకపోవచ్చునని ముఖ్యమంత్రి భావించి ఇంత కాలం ఇంటర్ విద్యకు సంబంధించిన అధికారులను కొనసాగనిచ్చారని అంటున్నారు. ఇప్పుడు కోర్టు కేసు ఒక కొలిక్కి వచ్చినందున ఇంటర్ బోర్డు ప్రక్షాళన తో బాటు మరి కొన్ని శాఖల ఐ ఏ ఎస్లను కూడా మార్చాలని ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చారని తెలిసింది. ఇంటర్ బోర్డు తో బాటు ఉన్నత విద్యా శాఖలో ఉన్నతాధికారుల మధ్య ఎడతెగని ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు, ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా ఉండాల్సిన ఉన్నత విద్యామండలిలోని కీలక వ్యక్తులకు, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్కు మధ్య పొడసూపిన విభేదాలు తారాస్థాయికి చేరాయి.దీంతో ఆ రెండు విభాగాలలో కూడా కీలక మార్పులు ఉండే అవకాశం కనిపిస్తున్నది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డికి తాజా పరిణామాలు ఏమాత్రం మింగుడు పడడం లేదు. సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ ఉన్నత విద్యా మండలి పనితీరుపై జనార్దన్రెడ్డి సమక్షంలోనే మండలి చైర్మన్, కార్య దర్శిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అధికార వర్గాల్లో చర్చనీయాంశ మైంది. మండలి వ్యవహారంపై జనార్దన్రెడ్డి సమక్షంలోనే నవీన్ మిట్టల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతో పాటు మండలి చేస్తున్న తప్పిదాలను ఎండగడుతున్నారు. అదే సమయంలో నవీన్ మిట్టల్పై పలు అవినీతి ఆరోపణలు వెలికివస్తున్నాయి. పాత కేసులు ఆయనను చుట్టుముడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇంకా చర్యలు తీసుకోకపోతే తప్పుడు సిగ్నల్ వెళతాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ముందుగా ఇంటర్బోర్డు కార్యదర్శి అశోక్ను, నవీన్మిట్టల్ను ఆయా స్థానాల నుంచి బదిలీ చేస్తారు. వీరితో బాటు ఒకే శాఖలో కూరుకుపోయి ఉన్న నలుగురు ఉన్నతాధికారులపై కూడా బదిలీవేటు పడబోతున్నది. మరి కొందరికి స్థానచలనం ఉంటుంది.
Tags:
telangananews