కర్నూలు జిల్లాలో సర్వశిక్ష అభియాన్లో మొత్తం 304 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 170 పోస్టులను ఔట్ సోర్సింగ్ కింద భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎస్ఎస్ఎలో ప్రత్యేక అధికారి, సిఆర్టి, పిఇటి, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎంఐఎస్ సమన్వయకర్త, సిఆర్పి (క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్), డిఎల్టిఎస్ (డివిజినల్ లెవల్ మానిటరింగ్ టీమ్), అకౌంటెంట్, కాంట్రాక్ట్ రెసిడెన్సియల్ టీచర్లు, కుక్, నైట్ వాచ్మెన్, పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్స్ తదితర పోస్టులు జూన్ నెలాఖరులోపు భర్తీ చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలిచ్చారు. నోటిఫికేషన్ లేకపోవడంతో ఏజెన్సీ యాజమాన్యం, ఎస్ఎస్ఎ సిబ్బందిలో కొందరు కుమ్మక్కై ఒక్కో పోస్టుకు ఒక్కో రేటుకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.
ఎస్ఎస్ఎ సిబ్బందిలో కుమ్మక్కు
కర్నూలు జిల్లా సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఎ)లో ఖాళీ పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు విద్యా శాఖలో ఉన్నతాధికారులు నిర్ణయించారు. నోటిఫికేషన్ ఇవ్వ కుండా టెండర్లు వేయడంతో గుంటూరుకు చెందిన ఓం డిటెక్టివ్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థ దక్కించుకుంది. గతంలో ఖాళీలు పడితే నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు వసూలు చేసి సదరు కాంట్రాక్టర్కు అప్పగించేవారు. ప్రస్తుతం ఎంపిక బాధ్యత ఏజెన్సికే అప్పగించడంతో ఈ వ్యవహారం విద్యాశాఖలో కొందరికి కాసులు కురిపిస్తోంది.ప్రభుత్వం నైపుణ్యంతో కూడిన నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రయత్నాలు చేస్తుంటే మరో వైపు ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు. ఒక్కో పోస్టు రూ. లక్ష నుంచి రూ.4 లక్షల వరకు అమ్ముకుంటున్నారు. ఏజెన్సీ తరపున కొందరు జిల్లాలో పోస్టులను అమ్ముకునేందుకు రంగంలోకి దిగారు. వారు తమకు అనుకూలంగా ఉన్న వారిని, ఎస్ఎస్ఎలో పనిచేస్తున్న ఉద్యోగులు సిఫార్సు చేసిన వారిని, ప్రజా ప్రతినిధులు సూచించిన వారి నుంచి లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఈ లొసుగులు తెలియని నిరుద్యోగులు తమ దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలో తెలియక ఎస్ఎస్ఎ చుట్టూ తిరుగుతున్నారు. ఎస్ఎస్ఎలో అధికారులను కలిస్తే, ఏజెన్సీకి ఇవ్వమంటారు. ఏజెన్సీ వారు ఎక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్నారో ఎవరికీ తెలియదు. దరఖాస్తులు కర్నూలు ఎస్ఎస్ఎలో ఇవ్వాలా..? లేక గుంటూరుకు వెళ్లి ఇవ్వాలా..? ఎక్కడ ఇవ్వాలి..? కనీసం ఫోను నెంబరు కూడా తెలియని స్థితి. ఇలా ఏమీ తెలియక అయోమయంలో ఉన్నారు. మరో పక్క ఉద్యోగాల అమ్మకం లోలోపల జోరుగా సాగుతోంది.
Tags:
Andrapradeshnews