స్కూళ్లకు చేరని పాఠ్య పుస్తకాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్కూళ్లకు చేరని పాఠ్య పుస్తకాలు


విజయనగరం, జూన్17, (way2newstv.com)
బడిగంట మోగింది... విద్యా సంవత్సరం ప్రారంభమైంది.. పాఠశాలలు తెరిచే నాటికి ప్రతి విద్యార్థికీ పాఠ్యపుస్తకాలు అందజేస్తామన్న అధికారుల మాటలు కోటలు దాటాయి...అయినా విద్యార్థుల దరికి పుస్తకాలు చేరలేదు. ఏటా ఇదే తంతు అయినా పుస్తకాల పంపిణీ సకాలంలో జరగడం లేదు. పాఠశాలలు తెరిచే నాటికి 40నుంచి 50శాతం మాత్రమే పుస్తకాలు విద్యార్థులకు అందుతున్నాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు.జిల్లా వ్యాప్తంగా 34 మండలాల విద్యార్థులకు 14,55050 పుస్తకాలు అవసరం. వీటిలో ఇప్పటికే జిల్లాలో 1,79,058పుస్తకాలు వరకు ఉన్నాయి. ఇంకా అవసరమైన 12,81161 పుస్తకాలు కోసం జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గత రెండు రోజులుగా జిల్లాకు సుమారుగా 2 లక్షలు వరకు పుస్తకాలు వచ్చాయి. ఇంకా పది లక్షల పుస్తకాలు జిల్లాకు రావాల్సి ఉంది. ఈ విద్యా సంవత్సరం వెనుకబడిన విద్యార్థులకు జ్ఞానధార పేరిట నెల రోజులు పాటు తరగతులు నిర్వహించారు. 


స్కూళ్లకు చేరని పాఠ్య పుస్తకాలు
అప్పుడు పుస్తకాలు ఇవ్వకపోయినా పాఠశాల తెరిచేనాటికైనా ఇస్తారని వారంతా భావించారు. కానీ విద్యార్థులకు నిరాశే ఎదురైంది.జిల్లాలో 2739 ప్రభుత్వ పాఠశాలలుఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 2,137, ప్రాథమికోన్నత పాఠశాలలు 235 ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు 367 వరకు ఉన్నాయి. మొత్తం పాఠశాలల్లో సుమారుగా 1,70, 263 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సుమారు 12లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. గతేడాది ఇదేసమయానికి జిల్లాలో ఎన్ని పుస్తకాలు అవసరమో గుర్తించి ఇండెంట్‌ కూడా పెట్టారు. మే నెలాఖరు నాటికి పాఠ్యపుస్తకాలన్నీ పాఠశాలలకు చేరుస్తామని చెప్పిన రాష్ట్ర విద్యాశాఖాదికారుల మాటలు అమలు కాకపోవడంతో.విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందే పరిస్థితి కనిపించలేదు. అరకొర పాఠ్యపుస్తకాలు మాత్రమే పాఠశాలలకు చేరాయి. అరకొర పుస్తకాలతో చదువులెలా సాగించాలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక పాఠశాలలు 53, ప్రాథమికోన్నత పాఠశాలలు 9, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు -9, కస్తూర్భా - 1 ఉన్నాయి. హైస్కూల్‌ విద్యార్థులు 4277, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు 3059, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు 1332 మంది ఉన్నారు. మొత్తం 8668 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సుమారుగా 45వేల 13 పాఠ్యపుస్తకాల కోసం ఇన్‌డెంట్‌ పెట్టగా, మొదటి విడతలో 14 వేల 43, రెండో విడతలో 13 వేల 950 పుస్తకాలు మాత్రమే వచ్చాయి. తెలుగు మీడియానికి సంబంధించి 1వ తరగతికి తెలుగు పాఠ్యపుస్తకాలు తప్ప మిగిలినవి రాలేదు. 2వ తరగతికి ఇంగ్లీషు, లెక్కలు, పరిసరాలు విజ్ఞానం మాత్రమే వచ్చాయి. 3వ తరగతికి తెలుగు మాత్రమే వచ్చింది. 4, 5 తరగతులకు తెలుగు, ఇంగ్లీషు, పరిసరాల విజ్ఞానం మాత్రమే వచ్చాయి. 6వ తరగతికి తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, సోషల్‌ మాత్రమే వచ్చాయి. 7వ తరగతి తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు వచ్చాయి. 8వ తరగతికి సంబంధించి లెక్కలు పుస్తకాలు తప్ప, మిగిలిన పుస్తకాలు రాలేదు. 9వ తరగతికి పుస్తకాలు రాలేదు. 10వ తరగతికి తెలుగు తప్ప మిగిలిన పుస్తకాలు రాలేదు. ఇక ఇంగ్లీషు మీడియానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు అరకొరగానే వచ్చాయి. ఒకటో తరగతి పరిసరాల విజ్ఞానం తప్ప మిగిలినవి రాలేదు. 2వ తరగతికి పుస్తకాలు రాలేదు. 3వ తరగతికి పరిసరాల విజ్ఞానం, 4, 5, 6, 7 తరగతులకు ఏమీ రాలేదు. 8వ తరగతికి సోషల్‌ మాత్రమే వచ్చింది. 9వ తరగతికి లెక్కలు, సోషల్‌, 10వ తరగతికి లెక్కలు, పిఎస్‌, సోషల్‌ పాఠ్యపుస్తకాలు మాత్రమే మండలానికి చేరాయి. వచ్చిన అరకొర పుస్తకాలను ఆయా పాఠశాలలకు పంపిణీ చేశారు. అరకొర పుస్తకాలను విద్యార్థులకు ఎలా పంపిణీ చేయాలో ఉపాధ్యాయులకు అర్థం కాలేదు. పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో పాఠశాలలకు చేరకపోవడంతో చదువులు ఎలా కొనసాగించాలని ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. అరకొర పాఠ్యపుస్తకాలు మాత్రమే పంపిణీ చేయడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.