క్రమశిక్షణ దాటితే వేటు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

క్రమశిక్షణ దాటితే వేటు


న్యూఢిల్లీ, జూలై 2, (way2newstv.com)
ఎంత పెద్ద నేత కుమారుడైన సరే, ఎమ్మెల్యే అయినా సరే.. పార్టీకి చెడ్డపేరు తెచ్చేవిధంగా ప్రవర్తిస్తే సహించేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పార్టీ నేతలు, ఎంపీలకు గట్టి హెచ్చరికలు చేశారు. బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్ వర్గియా కుమారుడు, యువ ఎమ్మెల్యే ఆకాశ్‌ విజయ్‌ వర్గియా ఇటీవల మున్సిపల్‌ అధికారులపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం  జరిగిన బీజేపీ పార్లమెంటరీ భేటీలో ఈ విషయం గురించి ప్రధానంగా ప్రస్తావించిన ఆయన.. పార్టీ ఎంపీలకు గట్టి హెచ్చరికలు చేసినట్లు సమాచారం. 

క్రమశిక్షణ దాటితే వేటు

పార్టీ పేరు చెప్పి దురుసుగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదని ప్రధాని స్పష్టం చేశారు. ‘ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదు. పార్టీ పేరును దెబ్బతీసే నేతలు మనకొద్దు. ఎవరి కుమారుడైనా సరే, బంధువైనా సరే అలాంటి వారిని పార్టీ నుంచి తొలగించాలి. వారికి మద్దతిచ్చే వారిని కూడా తప్పించాలి. ఈ విషయంలో ఏ వ్యక్తికీ మినహాయింపు లేదు’ అని మోదీ చెప్పినట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌కు చెందిన కైలాశ్‌ విజయ్‌ వర్గియా ప్రస్తుతం బీజేపీ జనరల్‌ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడే ఆకాశ్. ఇండోర్‌-3 నియోజకవర్గం నుంచి ఆకాశ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల ఆయన మున్సిపల్‌ అధికారులపై క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేశారు. ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో పోలీసులు ఆకాశ్‌ను అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన ఆకాశ్‌కు పార్టీ కార్యకర్తలు కొందరు ఘనంగా స్వాగతం పలకడం మరింత వివాదాస్పదంగా మారింది. పార్టీ తీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్న వేళ.. ఈ పరిణామాలపై ప్రధాని మోదీ తొలిసారిగా పెదవి విప్పారు. ఆకాశ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు